Sabarimala Gold: శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలు

శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలు

Sabarimala : శబరిమల ఆలయంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాలు బరువు తగ్గడంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో (Kerala High Court) విచారణ జరుగుతుంది. బంగారు తాపడాల విషయంలో అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, తాపడాలకు అసలు ఏమైందనే అంశంపై జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఈ బంగారు తాపడాల బరువు తగ్గుదలపై పలు సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.

Sabarimala Gold – అసలేం జరిగిందంటే ?

శబరిమల (Sabarimala) గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోగ్రాములు. వాటిని సరి చేయించేందుకు ఉన్నికృష్ణన్ అనే స్పాన్సర్ ముందుకొచ్చారు. అయితే, వాటిని తిరిగి ద్వారపాలక విగ్రహాలకు అమర్చే సమయానికి బరువు కేవలం 38.25 కేజీలకు తగ్గిపోయింది. ఇది వివాదానికి దారి తీసింది.

ప్రస్తుతం జాతీయ మీడియా కథనాల ప్రకారం… తాపడాలను పునరుద్ధరించేందుకు చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థకు తరలించాలి. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా దాదాపు 39 రోజుల ఆలస్యంగా అవి ఆగస్టు 29న చెన్నైకి చేరుకున్నాయి. ఈ మధ్య కాలంలో తాపడాలను పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొట్టయాంలోని ఓ దేవాలయంతో పాటు ఏపీలోని కొన్ని దేవాలయాలు, బెంగళూరులోని అయ్యస్వామి గుడికి తరలించారని సమాచారం. మళయాళ నటుడు జయరామ్ ఇంట జరిగిన ఓ ప్రత్యేక పూజ కార్యక్రమంలో కూడా తాపడాలను పెట్టారని తెలుస్తోంది.

చివరగా మరమ్మతుల అనంతరం అవి సెప్టెంబర్ 11న శబరిమలకు చేరుకున్నాయి. అప్పటికే వాటి బరువు అనుమానాస్పద రీతిలో తగ్గిపోయింది. యాక్టర్ జయరామ్ ఇంట్లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో తాపడాలను పెట్టినట్టు స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ కూడా ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. తమ వద్దకు వచ్చిన తాపడాల బరువు 38.28 కేజీలేనని తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు శబరిమలను వీడిన తాపడాలే స్మార్ట్ క్రియేషన్స్‌కు చేరుకున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాపడాలను భద్రపరిచే బాధ్యతను ఎవరు తీసుకున్నారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కేరళ రాజకీయ పక్షాలు, లిటిగెంట్లు కూడా ఇదే అంశాలను లేవనెత్తుతున్నారు.

మీడియా కథనాల ప్రకారం 1998లో వ్యాపారవేత్త విజయ్‌మాల్య… శబరిమల గుర్భగుడి కోసం 30 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది మరో 800 గ్రాముల బంగారం తలుపుల తాపడాల కోసం విరాళంగా దేవస్థానానికి అందింది. ఈ విషయంలో అన్ని డాక్యుమెంట్స్‌ను సేకరించి సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేరళ హైకోర్టు డివిజన్ బెంజ్ ఆదేశించింది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, ఈ అంశం రాజకీయంగా కూడా వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Sabarimala – శబరిమల బంగారం లెక్కల్లో అవకతవకలపై హైకోర్టు కీలక ఆదేశాలు

అయ్యప్పస్వామి కొలువుదీరిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు తగ్గడంపై శుక్రవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. బంగారం లెక్కల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని బహిర్గతం చేయొద్దని పేర్కొంది.

శబరిమల నుంచి దృష్టి మళ్లించేందుకు నటులను టార్గెట్‌ చేసారు – సురేష్‌ గోపి

కేరళలోని శబరిమల (Sabarimala) ఆలయంలోని బంగారు విగ్రహాల తాపడం బరువు తగ్గడం ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నటుడు, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. శబరిమల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలక్కడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్‌ గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఎదురైన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. శబరిమల బంగారు సమస్య నుంచి దృష్టిని మరల్చేందుకు ఇద్దరు సినీ నటులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఆ నటుల పేర్లను ఆయన ప్రస్తావించలేదు. శబరిమల బంగారు కవచాలకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)లు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయన్నారు. కేంద్రమంత్రిగా దీనిపై తాను ఇంతకుమించి వ్యాఖ్యానించలేనన్నారు.

ఇలాంటి ఘటనలు సాధారణమేనన్నారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే సంఘటనలు జరిగినప్పుడు.. ప్రముఖులే లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకోవడం మామూలే అన్నారు. ఇలాంటివి మరిన్ని చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆ నటుల పేర్లు చెప్పనప్పటికీ.. భూటాన్‌ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న కేసులో ఇటీవల పలువురి నటుల ఇళ్లల్లో కస్టమ్స్‌ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఆఫీసుతో పాటు దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ ఇళ్ల పైనా ఈ దాడులు జరిగాయి. దీంతో వీరిని ఉద్దేశించే సురేష్‌ గోపి తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం

Leave A Reply

Your Email Id will not be published!