Indian Railways: ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం !

ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం !

Indian Railways: రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే(Indian Railways) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు… ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా… రైల్‌ లోనూ బ్లాక్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రమాదం జరిగితే.. అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి ? ప్రమాదం జరిగినప్పుడు అసలేం జరిగింది ? అనే ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు రైళ్లలో క్రూ వాయిస్ వీడియో రికార్డింగ్ సిస్టమ్‌ (సీవీవీఆర్ఎస్) ను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. త్వరలోనే రైల్ ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్‌ లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Indian Railways – బ్లాక్ బాక్స్‌ ‌ను రైళ్లలో పెడితే ఉపయోగం ఏంటి ?

ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలల క్రితం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రైల్వే(Indian Railways) శాఖ రైళ్లలో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రైల్ ఇంజిన్‌లో బ్లాక్ బాక్స్ అమర్చడం వలన… ప్రమాదానికి ముందు జరిగే పొరపాట్లు, రైలు ప్రయాణించే మార్గానికి సంబంధించిన లోపాలపై ఎప్పటికప్పుడు లోకో పైలట్‌ ను అలర్ట్ చేస్తుంది. తద్వారా ప్రమాదాలు తగ్గడం, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా ఉంటుంది. అయితే బ్లాక్ బాక్స్ అమర్చే అంశంపై ప్రస్తుతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైల్వే అధికారులు. త్వరలోనే దీనిని రైళ్లలో ఏర్పాటు చేస్తామంటున్నారు.

అసలేంటీ బ్లాక్ బాక్స్ ?

విమానాల్లో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ గురించే చర్చ జరుగుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ద్వారా అసలేం జరిగిందో తెలిసిపోతుంది. అందుకే ఈ విధానాన్ని రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్‌ ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. ఈ బ్లాక్ బాక్స్.. లోకో పైలట్‌ల మాటలు, రైలు కార్యకలాపాల వీడియో, ఆడియో రికార్డ్ చేస్తుంది. రైలు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. వేగం, బ్రేక్స్, ఇంజిన్ స్థితి సహా కీలక అంశాలను అబ్జర్వ్ చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ బాక్స్‌లను రైళ్లలో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు దాదాపుగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

సీసీ కెమెరాలు కూడా..

బ్లాక్ బాక్స్‌తో పాటు… రైళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రైల్ ఇంజిన్‌ లో 4 డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల్లో రెండు కెమెరాలు ట్రైన్ లోకో పైలట్స్‌ కదలికలను ఫోకస్ చేస్తే… మరొకటి ఇంజిన్ బయట ట్రాక్‌ కు ఎదురుగా ఉండి, ట్రాక్‌ ను ఫోకస్ చేస్తుంది. నాలుగో కెమెరాను ఇంజిన పైభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నార్త్ ఈస్టర్న్ రైల్వే ఇంజిన్‌ లలో ఈ బ్లాక్ బాక్స్‌ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎనిమిది ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశామని… త్వరలోనే మరిన్ని రైల్వే ఇంజిన్లకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Also Read : Lok Sabha Polling: తొలి దశలో 65.5 శాతం పోలింగ్‌ నమోదు !

Leave A Reply

Your Email Id will not be published!