MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

 

బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్‌ దేబాంగ్సు బసాక్, జస్టిస్‌ మొహమ్మద్‌ షబ్బార్‌ రష్దిల డివిజన్‌ బెంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారత న్యాయశాస్త్ర చరిత్రలో హైకోర్టు ఇలా ఒక శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించి అతని సభ్యత్వాన్ని రద్దుచేయడం ఇదే తొలిసారి అని కలకత్తా హైకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణనగర్‌ (ఉత్తర) స్థానం ఖాళీ అయింది. అయితే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం లేవు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండమే ఇందుకు కారణం.

 

తృణమూల్‌ సీనియర్‌ నేత అయన ముకుల్‌ రాయ్‌ గతంలో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీతో విభేదాలొచ్చి పార్టీని వీడారు. తర్వాత బీజేపీలో చేరారు. దాంతో 2021 మేలో కృష్ణనగర్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. అయితే కేవలం నెలరోజులకే ఆయన మళ్లీ టీఎంసీ గూటికి చేరుకున్నారు. ముకుల్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్పీకర్‌ బిమన్‌ బెనర్జీని కోరారు. అందుకు స్పీకర్‌ అంగీకరించలేదు. దాంతో సువేందు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్‌కు మరో అవకాశం కల్పించింది. అయినా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ముకుల్‌ రాయ్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ… ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తీర్పుపై సువేంధు సంతోషం వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగబద్ధ విజయమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఆయన తరఫున దాఖలైన నామినేషన్‌ను సైతం కోర్టు రద్దుచేసింది.

Leave A Reply

Your Email Id will not be published!