Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది - పవన్

Pawan Kalyan : గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ (Pawan Kalyan) మంగళవారం సాయంత్రం తన ఎక్స్‌ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘బోర్డు, అధికారులు, ఈఓ, జేఈఓ నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విక్రేతల వరకు టీటీడీని (TTD) నడుపుతున్న ప్రతి ఒక్కరికీ మీ పాత్ర కేవలం హోదా లేదా బిరుదు కాదు. లక్షలాది మంది సనాతనులకు దైవిక సేవ చేయడానికి ఒక పవిత్ర అవకాశం. ఆర్థిక నివేదికలు, నాణ్యత నియంత్రణ, ఆడిట్‌ల నుంచి విరాళాల నిర్వహణ వరకు అన్ని కార్యకలాపాలలో పూర్తి పారదర్శకతను పాటించాలి.

అన్ని వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించడం భవిష్యత్తు కోసం ఒక ముందడుగు. ధర్మాన్ని రక్షించడం, దాని కోసం నిలబడటం ప్రతి ఒక్క సనాతనికి సమిష్టి బాధ్యత. దేశవ్యాప్తంగా ఉన్న మన దేవాలయాలన్నింటినీ సమాజం.. భక్తులే స్వయంగా నిర్వహించాలని నా ఆకాంక్ష’ అని అన్నారు.

Pawan Kalyan – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది – పవన్ కల్యాణ్

సనాతర ధర్మ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు డిప్యూటీ సీఎం. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని నొక్కిచెప్పారు.

సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకికతత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనదని ఉద్ఘాటించారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో సనాతన ధర్మం ఒకటని అభివర్ణించారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read : Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

Leave A Reply

Your Email Id will not be published!