Ramachander Rao: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు మాదే - బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు
Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపాతోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని చెప్పారు.
Telangana BJP Chief Ramachander Rao Comments
‘‘నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా మారుస్తామని భారత రాష్ట్ర సమితి గతంలో చెప్పింది.. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయి. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తాం. ఈ ఉప ఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇవ్వాలి. రేపటి నుంచి కార్యకర్తలు, నేతలు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయాలి. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి లోపాయికారీ ఒప్పందాన్ని తిప్పికొట్టాలి’’ అని రామచందర్రావు (Ramachander Rao) కోరారు.
బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి బీజేపీ – కూనంనేని సాంబశివరావు
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ, భారత రాష్ట్ర సమితి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వారికి కనీసం బాధ కూడా లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వంపై ద్వేషమా… బీసీలపై ప్రేమ లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు.
‘‘అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకు? బీసీ బిల్లుకు మేం మద్దతిచ్చాం.. కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యాం. మీరెందుకు కాలేదు. సుప్రీంలో 50శాతం దాటొద్దని తీర్పు ఉంది. 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారా తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కేంద్రానికి ఉన్నా చేయడం లేదు. బాధ్యత మొత్తం భాజపా పైనే ఉంది. కానీ డొంకతిరుగుడు రాజకీయాలతో ప్రజలను పార్టీ నేతలు గందరగోళానికి గురిచేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి భాజపా.. వాళ్లకు మద్దతిస్తోంది భారత రాష్ట్ర సమితి. అన్ని పార్టీల నేతలను దిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉంది. అవసరమైతే.. అన్ని పార్టీలతో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాటు చేయాలి. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా ముందడుగు పడుతుంది.’’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.
Also Read : Bhatti Vikramarka: హైదరాబాద్ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క
