అమరావతి : ఏపీలో చోటు చేసుకున్న బర్డ్ ఫ్లూ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భోపాల్ ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా భారత ప్రభుత్వ పశుసంవర్ధక , డెయిరీయింగ్ శాఖ ద్వారా ఫిబ్రవరి 8న వ్యాధి నిర్ధారణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. నిర్ధారణ వెలువడిన వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను మోహరించి, నిర్ణీత ప్రామాణిక కార్యాచరణ విధానాల ప్రకారం కట్టుదిట్టమైన కల్లింగ్ (తొలగింపు) చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కర్వేటినగరం మండలంలో పక్షుల అకస్మాత్తు మరణాల సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో పశువైద్య బృందాలు పరిశీలనలు నిర్వహించి, నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. సంబంధిత రైతులకు అవసరమైన బయోసెక్యూరిటీ, ముందస్తు జాగ్రత్త చర్యలపై స్పష్టమైన సూచనలు అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆదివారం రెండు పొలాలలో కల్లింగ్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో భారత ప్రభుత్వం ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగినట్లు వెల్లడించారు.