ఆందోల్ – జోగిపేట : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. 2 లక్షల జాబ్స్ ప్రకటిస్తే ఇందులో ఇప్పటి వరకు 70 వేలకు పైగా భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. మహిళా సంక్షేమం, వ్యవసాయం, యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు తో తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ దిశగా దూసుకు పోతోందని చెప్పారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీలోని 9, 4, 7, 5, 6, 8వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తో కలసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
అన్ని వార్డులలో ఓటర్ల నుండి విశేష స్పందన లభించింది. మహిళలతో కలసి స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం పై చర్చించారు దామోదర రాజ నరసింహ. మున్సిపాలిటీ లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు . రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం , అభివృద్ధి , మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్య , వైద్య రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషి ని వివరించారు ఈ సందర్బంగా. స్థానికంగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి. అభివృద్ధికి నిలయంగా అందోల్ – జోగిపేట మున్సిపాలిటీని మారుస్తామని ప్రకటించారు. అందోల్ – జోగిపేట మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అన్ని వార్డులలో భారీ మెజారిటీ తో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
