హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగాల్సిన రాష్ట్రంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాచరిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి బూతు పురాణంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అండ చూసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కనీస రాజకీయ సంస్కారం లేకుండా మాజీ మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. క్యాతనెపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్ రావు పైనా దాడి చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు.
సాక్షాత్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను బెదిరించడం, బలవంతంగా బుర్కాలు కప్పించి లోపలికి తీసుకెళ్లి విత్డ్రా చేయించడం వంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. కోడంగల్లో కూడా ఇదే తరహా రౌడీయిజం కొనసాగిందన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడం ద్వారా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తోందని అన్నారు. పోలీసులను తొత్తులుగా మార్చుకుని తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఇదే దాడికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు.
