తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఇవి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సవంగా మారుస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న, మధ్య, పెద్ద పరిమాణాల్లో సుమారు 75కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. నాలుగు మాడ వీధులలో గరుత్మంతుడిపై మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆభరణాల వేంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీ, గజ వాహనం, ఆదిశేషుడిపై మహావిష్ణువు, దశావతారాలు, అష్టలక్ష్మీ తదితర రూపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అదేవిధంగా శ్రీనివాస మంగాపురం–చెర్లోపల్లి పరిసర ప్రాంతాల్లో దశావతారాలు, అష్టలక్ష్మీలు, శ్రీవేంకటేశ్వర స్వామి, మహావిష్ణువు–లక్ష్మీదేవి, గజవాహనంపై లక్ష్మీదేవి, శంఖు–చక్రాలు, ఏనుగులు, కమలాలు, వారాహావతారం, తోరణాలు, చిన్న లక్ష్మీదేవి రూపాలు, అభయహస్తం, వజ్ర కిరీటం, కటిహస్తం, నైన్ వాట్స్ తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి . చెర్లోపల్లి–శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి–కాలూరు మార్గాలు, జాతీయ రహదారుల వెంట ఎల్.ఈ.డి లైట్లతో డిజైన్ చేసిన ఆర్చ్లు ఏర్పాటు చేశారు. పుదిపట్ల జంక్షన్, శ్రీనివాసమంగాపురం–తిరుపతి పరిసరాలు, ఆలయ పుష్కరిణి, ఆలయం లోపల, వెలుపల, నాలుగు మాడ వీధులు, కార్ పార్కింగ్ ప్రాంతం, శ్రీనివాసమంగాపురం–నరసింగాపురం జంక్షన్, చంద్రగిరి బస్టాండ్, శ్రీనివాస మంగాపురం రైల్వే గేట్ తదితర ప్రాంతాలు రాత్రి వేళల్లో రజతంలా మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తున్నాయి.