Tribal Woman: గిరిజన మహిళ దాతృత్వం ! ఇందిరమ్మ ఇళ్లకు ఎకరం భూమి దానం!
గిరిజన మహిళ దాతృత్వం ! ఇందిరమ్మ ఇళ్లకు ఎకరం భూమి దానం!
ఎకరం భూమిని తోటి గ్రామస్థులకు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు ఓ గిరిజన మహిళ. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ(ఎస్) పంచాయతీలో కోలాం గిరిజనులకు 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ నిర్మించుకోవడానికి స్థలం కరవైంది. అధికారులను సంప్రదిస్తే స్థలం ఉండాల్సిందేనని, లేదంటే రద్దవుతాయని చెప్పారు. అనుబంధ గిరిజన గ్రామమైన సాహెజ్కు చెందిన మహిళ ఆత్రం లేతుబాయి ఈ విషయం తెలుసుకొని గ్రామ శివారులో ఉన్న తన ఎకరం భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. సర్వే నంబరు 18/2/10 లోని తనకున్న మూడెకరాల్లో ఎకరం భూమిని విరాళంగా అందించేందుకు అఫిడవిట్ను తహసీల్దార్ జాదవ్ రామారావుకు శుక్రవారం అందజేశారు. ఆమె దాతృత్వాన్ని అధికారులు, గ్రామస్థులు కొనియాడారు.
ఖమ్మం జిల్లా వాసికి రూ.240 కోట్ల లాటరీ
యూఏఈలో ఇటీవల నిర్వహించిన లాటరీలో రూ.240కోట్లు గెలుచుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి బోల్లా అనిల్కుమార్ ఖమ్మం జిల్లా యువకుడేనని తెలిసింది. జిల్లాలోని వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన సాధారణ రైతు దంపతులు మాధవరావు, భూలక్ష్మిల కుమారుడైన అనిల్ బొల్లా… ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. హైదరాబాద్లో ఉన్నతవిద్య పూర్తి చేసి తొలుత నగరంలో… తరువాత చెన్నైలో ఉద్యోగం చేశారు. యూఏఈలో ఉద్యోగ అవకాశం రావడంతో ఏడాదిన్నర క్రితం అక్కడకు వెళ్లారు. కొంత కాలంగా పలు లాటరీల్లో పాల్గొంటున్న ఆయన… ఇటీవల కొనుగోలు చేసిన పది టికెట్లలో, తన తల్లి పుట్టినరోజుతో కూడిన నెంబరుకు జాక్పాట్ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు.
