#Media : నాటి మీడియా స్వాతంత్య్రం నేడు ఎక్కడ?
Media : స్వాతంత్య్ర భారతదేశంలో మీడియా అనే ఒక మహా ప్రయాణంలో సమాజం తనవైపు నుంచి తాను ఒకసారి పరికించుకోవడానికి పరిణామాలు అని తప్పక తరచి చూడాల్సిన అవసరం ఉందా?
Media : స్వాతంత్య్ర భారతదేశంలో మీడియా అనే ఒక మహా ప్రయాణంలో సమాజం తనవైపు నుంచి తాను ఒకసారి పరికించుకోవడానికి పరిణామాలు అని తప్పక తరచి చూడాల్సిన అవసరం ఉందా? అంటే అవుననే చెప్పాలి. ఇలాంటి అంతరావలోకనం మనం ఎటు నుంచి ఎటు వైపునకు పయనిస్తున్నామని తెలుసుకోవడానికీ, మన ప్రణాళికలు పునర్ రూపొందించు కోవడానికీ దోహదపడుతుందన్నది వాస్తవం.
స్వాతంత్య్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాలలో మీడియా (రేడియో, టీవీ, పత్రికలు వగైరా) ఎటువంటి మార్పులకు లోనయ్యాయన్నది నిజం. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రపంచ వ్యాప్తంగా జర్నలిజానికి ఇది వంద సంవత్సరాలు దాటిన సందర్భం. ప్రధానంగా గుణాత్మకంగా పరిణామాలు ఏమిటనే భావనాత్మక విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇతర ప్రపంచదేశాల పట్ల విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇదే జర్నలిజం అనే కొత్త విభాగం రావడానికీ, అది పరిపుష్ఠం కావడానికి ఎంతో దోహదపడిందనే చెప్పాలి.
ఇక రెండవ ప్రపంచయుద్ధంలో వినాశనం విపరీత స్థాయికి చేరటంలో సాంకేతిక విజ్ఞానం కీలక పాత్ర పోషించింది. అయితే సమాజంలో సైన్స్ మరియు టెక్నాలజిల పట్ల ఆసక్తి పెరిగి, సైన్స్, జర్నలిజం వృద్ధి చెందడానికి తోడ్పడిందపి చెప్పాలి
20వ శతాబ్దం అచ్చు యంత్రం, టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలి ప్రింటర్, రేడియో, టీవీ వంటి ఆవిష్కరణలు రాకతో సామాజిక అవసరాలకు తగినట్టు సాంకేతిక విజ్ఞానం సౌలభ్యంకు దారి తీసింది. . అగ్రరాజ్యాల కాంక్షల వెనక ప్రణాళికలు , అంతర్గత ఉద్దేశాలు ప్రపంచానికి తెలియ చేయటంలో మీడియా ఎంతో ఉపయోగపడింది. అలాగే పలు దేశాల ప్రభుత్వాలలో అంతర్గత విషయాలు ప్రజలు అందుకోవటానికి మీడియా పోషించిన పాత్ర విశేషమైంది. అప్పటికి అక్షరాస్యత తక్కువ ఉన్నా, అచ్చు యంత్రాలు అతి సాధారణంగా ఉన్నా ప్రచార సాధనాలుగా ఉన్న పత్రికలు, రేడియో మా తాము చేయాల్సిన పనిని సమగ్రంగా, చిత్తశుద్ధితో చేసాయి.
మన దేశం లో ఇన్ని విభిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు ఉన్నప్పటికీ ఏకమై ఉండటానికి కారణం సమాచారం ప్రజలకు చేరవేయటమే. అందుకే భారతీయ పత్రికల ప్రారంభ చరిత్ర మహోజ్వలంగా విశ్లేషకులు చెపుతారు. . వందేళ్ల క్రితం మంచి ఆలోచనకు బాసటగా పత్రికలు నిలచాయి. పత్రికల వేదికగానే రాజారామమోహన రాయ్, బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, మహాత్మాగాంధీ, అంబేద్కర్, కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం ఇలా ప్రతి ఒక్కరు తమ చేపట్టిన పనులు సాధించగలిగారు. అనేక సంస్కరణలలోనూ అంతర్భాగం అయ్యాయి.
మన దేశంలో జరిగిన స్వాతంత్రోద్యమంతో మమేకమైన పత్రికలూ చాలా ఉన్నాయి. స్ధానిక భాషలలో ఉండే పత్రికల పరిధి, ప్రతుల సంఖ్య తక్కువ కావచ్చు- కానీ అవి సాధించిన ఫలితం చాలా గొప్పది. దేశ ప్రజలను ఒక తాటి మీద నిలపడానికి పత్రికల కృషి కీలకమైనది.
తెలుగునాట టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి ప్రజా నాయకులు ప్రముఖ సంపాదకులు కూడా వ్యవహరించారు. కాశీనాథుని నాగేశ్వర రావు (ఆంధ్ర పత్రిక), కేసరి (గహలక్ష్మి), పందిరి మల్లికార్జున రావు (కిన్నెర), వరద రాజులు నాయుడు (ఇండియన్ ఎక్స్ప్రెస్) వంటి పత్రికా స్థాపకులందరూ ఏనాడు లాభార్జనల కోసం వెంపర్లాడలేదు. తమ వాణి జ్య సంస్ధలు, ప్రధానంగా ఔషధాల అమ్మకం లో లాభించిన మొత్తంతోనే పత్రికలు నడిపారన్నది నిజం. పత్రికల యజమానులను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్ని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా జాతీయం చేశారని భావిస్తున్నారు. ఇది అంతర్గత వ్యూహమని ఇప్పటికీ చెప్పుకునే మాట.
కానీ నేడు వాణిజ్యం, జర్నలిజం అనేవి కలవడం అనేది ఈనాటి విషయం మాత్రమే కాదు. అయితే అంతర్గత లక్ష్యాలు పూర్తిగా మారిపోవడం వల్ల ఎదుటి వ్యక్తులపై పార్టీలపై బురద జల్లేందుకు విష ప్రచారాలు చేసేందుకు సొంత మీడియాను వాడేసుకుంటున్నారు. మీడియా అధినేతలు ప్రధాన భూమిక రాజకీయాలలో పోషిస్తూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అవతరించి చివరకి మీడియా గొంతుని నొక్కేందుకు… అవసరమైతే కోసేటందుకు కూడా ఏమాత్రం వెరవటం లేదు. పైగా జర్నలిస్టు సంఘాలలో కీలక భూమికలు పోషించినవారు. సంపాదకులుగా, జర్నలిస్టులుగా పదవీ బాధ్యతలు నెరవేర్చిన వాళ్లు నేడు ప్రభుత్వంలో సలహాదారులుగా వ్యవహరిస్తునే మీడియా గొంతు నొక్కడంతో పాటు ఆయా యాజమాన్యల మీద, ఆ యా సంస్ధల తరపున వార్తాంశాల సేకరణకొచ్చిన పాత్రికేయుల మీద రంకెలేస్తున్నారు.
ఇటీవల ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎక్రిడేషన్ కమిటీలో కనీసం సాధారణ జర్నలిస్టులకు కూడా స్థానం కలిపించక పోవటం పరాకాష్ఠ అనే చెప్పాలి. జర్నలిస్టులు సమస్యలపై అధికారులే చర్చలు జరిపి నిర్ణయాలు తీసేసుకుంటారట. మరి ఇప్పటికే ఓ వర్గం మీడియాకే ప్రభుత్వ పరంగా అందుతున్న అనేక సంక్షేమాలు , ఇతర మీడియాలకు ఇప్పటికీ విస్తరించిన పాపాన పోలేదు . ఇది మున్ముందుకూడా ఆశించడం దుర్లభమమే. మరి ఈ కమిటీల నిర్ణయాలు ఏదిశగా జర్నలిస్టులను ప్రభావితం చేస్తాయో చూడాలి.

No comment allowed please