G Kishan Reddy : సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
G Kishan Reddy : కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోయినాబాద్ ఫామ్ హౌజ్ లో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ నిర్వాకంపై తీవ్రంగా స్పందించారు. గురువారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. తమకు రూ. 100 కోట్లు పెట్టే స్థోమత లేదని అన్నారు.
ఇదంతా పక్కా సీఎం కేసీఆర్ వేసిన స్కెచ్ అని ఆరోపించారు. ఇది పూర్తిగా కుట్రకు తెర తీశారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన మీరా మమ్మల్ని ప్రశ్నించేది అన్నారు. త్వరలో నాలుగో ఆర్ కూడా రాబోతుందన్నారు కిషన్ రెడ్డి(G Kishan Reddy). ఇప్పటికే మీకు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ తో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా చేరుతారని జోష్యం చెప్పారు.
మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అవినీతి మరక లేనటువంటి ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు. కుట్రలు, కుతంత్రాలకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు. కేసీఆర్ ఆయన ఫ్యామిలీ ఎన్ని కథలు చెప్పినా నమ్మే స్థితిలో లేరన్నారు కేంద్ర మంత్రి.
ఎవరినైనా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని అనుకుంటే మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం చేయరని స్పష్టం చేశారు. ఎవరైనా చేరాలని అనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నందకుమార్ తో సంతోష్ రావు దిగిన ఫోటో గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
Also Read : 500 రోజుల్లో మునుగోడు పురోభివృద్ది