న్యూఢిల్లీ : పోలీసుల దౌర్జన్యం, ఆలయ విరాళాల చోరీపై మోదీని ఏకి పారేశాయి ప్రతిపక్షాలు. రాజ్యసభ సమావేశ మైనప్పుడు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడటానికి ప్రయత్నించారు, కానీ ప్రతిపక్ష సభ్యులు ముందుగా నినాదాలు ఆపి తమ స్థానాలకు తిరిగి రావాలని చైర్మన్ పట్టుబట్టారు. పార్లమెంటులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షం ద్వంద్వ దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాలపై ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ , పెల్లెట్ గన్ ప్రయోగంపై హోం మంత్రి అమిత్ షా సభకు హాజరై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభలో ప్రభుత్వంపై పోరాటానికి నాయకత్వం వహించారు.
ఇక ఆలయాల్లో వరుసగా జరుగుతున్న విరాళాల చోరీ ఆరోపణలపై పార్లమెంటు ప్రాంగణంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. నిరసనకారులైన విద్యార్థులపై పోలీసుల అరాచకాల”కు వ్యతిరేకంగా కూడా ఆమె గళమెత్తారు. ప్రభుత్వాన్ని జవాబుదారీని చేసే వరకు పార్లమెంటు బయటా ఉభయ సభలలోనూ తమ నిరసనలు కొనసాగుతాయని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మతపరమైన అంశాన్ని తెరపైకి తెస్తూ హిందూ సాధువులను అవమానించారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ప్రతిపక్షంపై బీజేపీ ఆరోపణలు చేసింది. విరాళాల చోరీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో కాషాయ వస్త్రాలు ధరించడం ద్వారా ప్రతిపక్ష నాయకులు కాషాయాన్ని , హిందూ సాధువులను “హాస్యాస్పదంగా” మార్చారని అధికార పార్టీ ఆరోపించింది.
