BJP Jana Sena Comment : పొత్తు పొద్దు పొడిచేనా ఓట్లు రాలేనా

తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన..బీజేపీ

BJP Jana Sena Comment : రాజ‌కీయాలు విచిత్రంగా ఉంటాయి. శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. ఇవాళ ఒక పార్టీలో ఉన్న వాళ్లు రేపు ఇంకో పార్టీలో క‌నిపిస్తారు. చూసే వాళ్ల‌కు ఇది విచిత్రంగా ఉంటుంది. అంతే కాదు కేవ‌లం ప‌ద‌వుల ప్రాతిప‌దిక పైనే పొత్తులు పొద్దు పొడుస్తుంటాయి. ఏ పార్టీ రంగంలో ఉన్నా ఆయా పార్టీల అధినేత‌లు చెప్పేది ఒక్కేటే. మేం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నామ‌ని. కానీ చేసేది ఏమీ ఉండ‌దు. ఏ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చినా ఆ స‌ర్కార్ ను , కేబినెట్ ను శాసించేది వ్యాపార వ‌ర్గాలు, కార్పొరేట్ కంపెనీలే. కేంద్రంలో మోదీ, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కొలువు తీరినా దానిని వెనుక నుండి న‌డిపిస్తున్న‌ది ఒకే ఒక్క‌డు మోదీ అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే. అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ. ఇక తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ ప‌వ‌ర్ లో ఉన్నా స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఇదంతా ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది.

BJP Jana Sena Comment Viral

న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ(BJP), వైఎస్సార్ టీపీ, బీఎస్పీ తో పాటు ఇండిపెండెంట్లు బ‌రిలో నిల‌వ‌బోతున్నారు. మొత్తం 119 సీట్ల‌కు గాను బీఆర్ఎస్ పూర్తి లిస్టు ప్ర‌క‌టించింది. ఇక కాంగ్రెస్ రెండు జాబితాలుగా 100 సీట్ల‌ను ఖ‌రారు చేసింది. బీజేపీ ఇంకా స‌గం ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ను ఓడించి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే ఇప్ప‌టికే కాంగ్రెస్ బీజేపీ(BJP) గురించి చేస్తున్న ప్ర‌చారంలో స‌క్సెస్ అయ్యింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టేన‌ని కేసీఆర్ ను జైలుకు పంపిస్తాన‌న్న అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల్లో ఈ రెండు పార్టీలు ఒక్క‌టేన‌న్న అభిప్రాయానికి వ‌చ్చాయి. ఆంధ్రా షెటిల‌ర్ల ఓట్లు కీల‌కం కానున్నాయి తెలంగాణ‌లో. హైద‌రాబాద్ తో పాటు చాలా చోట్ల నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించ‌నున్నారు.

దీంతో ఎలాగైనా స‌రే ఈ ఓట‌ర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మ‌ళ్ల‌కుండా ఉండేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఎంపీ లక్ష్మ‌ణ్ లు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. త‌మ‌కు స‌పోర్ట్ చేయాల‌ని కోరారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ బీజేపీ పంచ‌న చేరారు. అంటీ ముట్ట‌న‌ట్టు ఉన్నారు. కానీ ఆయ‌న ముందు నుంచీ కేంద్రం జపం చేస్తున్నారు. తాజాగా ఎన్నిక‌ల్లో 32 సీట్ల‌లో తాము పోటీ చేస్తామంటూ ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి సీట్ల స‌ర్దుబాటు చేసుకుంటే ఓట్ల‌ను బీజేపీ వైపు మ‌ళ్లించ‌వ‌చ్చ‌ని ఆశిస్తోంది బీజేపీ. మ‌రి క‌మ‌లం విక‌సిస్తుందా..జ‌న‌సేన గ్లాసు ర‌క్షిస్తుందా అన్న‌ది వేచి చూడాలి. ఈసారి ఓట‌ర్లు ఎవ‌రి వైపు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Babu Mohan : బాబు మోహ‌న్ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!