Minister Seethakka : కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీతక్క భావోద్వేగం
తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్లో లాయర్గా పనిచేశానని గుర్తుచేశారు...
Minister Seethakka : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాయని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్లో మంత్రి సీతక్క ఇవాళ(ఆదివారం) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ… తమ ప్రభుత్వానికి సంవత్సర కాలంలో ప్రజలు ఆమోదం తెలిపారన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో అర్బన్ నక్సలెట్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న వాఖ్యలను ఖండిస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు.
Minister Seethakka Comments
తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్లో లాయర్గా పనిచేశానని గుర్తుచేశారు. తాను మూడుసార్లు ప్రజా ప్రతినిదిగా పనిచేశానని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ది ఏ భావజాలమో బండి సంజయ్(Minister Bandi Sanjay) తెలుసుకోవాలన్నారు. నేరుగా బండి సంజయ్ తనపై కామెంట్స్ చేయండి , కానీ క్యాబినెట్ అంతటిని అనడం సరికాదని అన్నారు. బీజేపీ మద్దతుతో టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు. వరంగల్, కరీంనగర్ పోరాటాల గడ్డ అని.. ఈ విషయం బండి సంజయ్ తెలుసుకోవాలని మంత్రి సీతక్క చెప్పారు. బీజేపీ అగ్ర నాయకులు మోదీ, అమిత్ షాలు మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రమ్మని అంటుంటే బండి సంజయ్ తమను అర్బన్ నక్సలెట్స్ అనడం శోచనీయమన్నారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనను చాలా విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మనసును నొప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. బండి సంజయ్ తన వాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
ఎన్కౌంటర్లేని తెలంగాణ, శాంతి భద్రతల తెలంగాణనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు ఇళ్లు, భూములు పంపిణీ చేశామన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మార్కెట్ పదవులు పొందగానే సరిపోదు అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో రైతులకు రుణాలు రీ షెడ్యూల్ చేయకపోవడంతో రుణమాఫీ అర్హతను కోల్పోయారని మంత్రి సీతక్క తెలిపారు.
Also Read : AP & TG Weather : ఏపీ మరియు తెలంగాణ ప్రజలకు ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు
