US Vice President JD Vance: భారత్ కు చేరుకున్న జేడీ వాన్స్ ! అక్షర్ ధామ్ ఆలయంలో జేడీ వాన్స్ దంపతులు !
భారత్ కు చేరుకున్న జేడీ వాన్స్ ! అక్షర్ ధామ్ ఆలయంలో జేడీ వాన్స్ దంపతులు !
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్ కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయనకు ఎయిర్పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. కాగా, వాన్స్ వెంట ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లుల కూడా వచ్చారు. జేడీ వాన్స్ పిల్లులు… భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఎయిర్ పోర్టులో భారత శాస్త్రీయ నృత్యంతో వారికి సాదర స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు.
US Vice President JD Vance India Visit
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్(JD Vance) భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. వాన్స్ కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్కల్యాణ్ మార్గ్లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు.
వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనపై వారి మధ్య చర్చలు సాగుతాయి. దీనితోపాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతమిచ్చే అవకాశాలపై చర్చిస్తారు. భేటీ అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ట్రంప్ టారిఫ్ దూకుడు వేళ… ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అనుసరిస్తోన్న కఠిన వలసవిధానాలు భారత్ నుంచి వెళ్లిన విద్యార్థులు, పౌరులకు గుబులు రేపుతున్నాయి. ఈ అంశంపైనా వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్ లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్(India), అమెరికా సంబంధాల విస్తృతిపై మాట్లాడతారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరవుతారు. 23వ తేదీ ఉదయం వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్ ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.
అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
భారత్ లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారీ భద్రత మధ్య కుటుంబ సమేతంగా ఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి… అక్షర్ ధామ్ ఆలయం ఎదుట జేడీవాన్స్ కుటుంబ సభ్యులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
Also Read : Minister Kondapalli Srinivas: ఘనంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు