Himanshi Narwal: ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు – హిమాన్షీ నర్వాల్
‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు - హిమాన్షీ నర్వాల్
పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రమూకపై భారత ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ యాక్షన్ కు ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరని… పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ సతీమణి హిమాన్షీ తెలిపారు. ఆమె ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొందని… భవిష్యత్తులోనూ కొనసాగించి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా హిమాన్షీ నర్వాల్ మాట్లాడుతూ… ‘‘ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి తీసుకురావాలన్న లక్ష్యంతోనే నా భర్త రక్షణ దళాల్లో చేరారు. ఇప్పుడు ఆయన లేకపోయినా… ఆ స్ఫూర్తి మాత్రం ఉంది. అమాయకుల ప్రాణాలు తీసి… వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన వారికి పడినశిక్ష చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి. నాలాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదు. భారత్ చేపట్టిన మిలిటరీ యాక్షన్ కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరు సరిగ్గా సరిపోయింది. నాకు ఇటీవలే పెళ్లైంది. నా జీవితాన్నివారు లాగేసుకొన్నారు. ఒక్క క్షణంలో నా జీవితం తల్లకిందులైంది. నాతోపాటు చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి. పురుషులు కూడా తండ్రిని, సోదరుడిని కోల్పోయారు. నిజంగా చెప్పాలంటే.. నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో చెప్పలేను. కానీ, ఈ చర్యతో కొంత ఊరట వచ్చింది. ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభం. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలి’’ అని ఆమె పేర్కొన్నారు.
ఇప్పుడు మోదీజీ సమాధానం చెప్పారు – హిమాన్షీ తండ్రి సునీల్
‘ఆపరేషన్ సిందూర్’ పై హిమాన్షీ తండ్రి సునీల్ స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదులు బాధితులను వెళ్లి మోదీకి చెప్పమన్నారు. ఇప్పుడు మోదీజీ… ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పారు. ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన జవాబు ఇస్తుందని నేను నా కుమార్తెకు చెప్పాను. పాక్ పై దాడులను తాము స్వాగతిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.