Hyderabad Metro: ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో

ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. తాజాగా పెంచిన టిక్కెట్టు ధరలు మే 17 నుండి అమలులోనికి తీసుకువస్తున్నట్లు స్ఫష్టంచేసింది. ప్రస్తుతం మెట్రో రైలులో టికెట్ కనిష్ట ధర రూ. 10.. గరిష్టంగా రూ.60 గా ఉంది. అయితే ఇప్పుడు పెంచిన ధరలతో ఇకపై మెట్రో రైలు(Hyderabad Metro) టికెట్ ధర కనిష్టంగా రూ.12 కాగా.. గరిష్టంగా రూ.75గా పెరగనుంది.

Hyderabad Metro Shock

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేర్చడంలో మెట్రో రైలు(Hyderabad Metro) కీలకంగా వ్యవహరిస్తోంది. అటు ఎల్ బీ నగర్ నుంచి ఇటు మియాపూర్ వరకు… అలాగే ఇటు నాగోలు నుంచి అటు రాయదుర్గం వరకు ప్రయాణించే ఈ మెట్రో రైలు నగరవాసులను అతి కొద్ది కాలంలోనే ఆకట్టుకుంది. ప్రతి రోజు ఈ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నగరంలో భారీ వర్షం పడినప్పుడు… ప్రయాణికులు ఈ మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విశ్వ నగరం వేదికగా క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు… మెట్రో ప్రత్యేక సర్వీసులను సైతం నడుపుతోంది.

అయితే మెట్రో నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో ఛార్జీల పెంపు ప్రతిపాదన గతంలోనే వచ్చింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో నాడు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మెట్రో రైలు సంస్థ వెనకడుగు వేసింది. కానీ మెట్రో రైలు సేవల కారణంగా… హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీనితో ఛార్జీల పెంపు అనివార్యమైందని తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు భారీ నష్టాలతో నడుస్తుందని ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెట్రో ఛార్జీలు పెంపు అనివార్యమని స్పష్టం చేసింది. దీనితో మే 10వ తేదీ తర్వాత మెట్రో ఛార్జీలు పెంచుతామని ఇప్పటికే స్పష్టం చేసింది. అందులోభాగంగా మే 17వ తేదీ నుంచి ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తుంది. అందులో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది. దీనితో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నష్టాల బాటలో నడిచేందుకు ఇది ఒక కారణమని ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

పెరిగిన ఛార్జీల వివరాలు ఇవే

మొదటి రెండు స్టాప్‌ లకు రూ.12
రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18
4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30
6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40
9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50
12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55
15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60
18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66
21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70
24 స్టాప్‌లు.. ఆపైన రూ.75

Also Read : ED Raids: వైఎస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ! 9 కోట్ల నగదు, 23 కోట్లు విలువచేసే బంగారం, వజ్రాలు స్వాధీనం !

Leave A Reply

Your Email Id will not be published!