YouTuber Jyoti Malhotra: ఎన్ఐఏ చేతిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ టూర్ డైరీ
ఎన్ఐఏ చేతిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ టూర్ డైరీ
YouTuber Jyoti Malhotra : యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్ కు గూడచర్యం చేస్తున్న జ్యోతి మల్హోత్రాను(Jyoti Malhotra) మే 16న ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెపై పలు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)దర్యాప్తు చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు పాకిస్థాన్ పర్యటనలు, చైనా సహా ఆమె చేసిన టూర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు హర్యానా పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకోవడంతో… ఆమె పాకిస్థాన్ పర్యటన గురించి మరింత రహస్య సమాచారం లభ్యమైంది. దీనితో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ టూర్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
YouTuber Jyoti Malhotra – జ్యోతి మల్హోత్రా డైరీ సీక్రెట్స్ ఇవే
తేదీ లేని డైరీ ఎంట్రీలలో, ఆమె 10 రోజుల పాకిస్థాన్(Pakistan) పర్యటన నుంచి “నా దేశం” భారతదేశానికి తిరిగి వచ్చినట్లు ప్రస్తావించింది. “ఈ సమయంలో, నేను పాకిస్థాన్ ప్రజల నుంచి చాలా ప్రేమను పొందాను. మా సబ్స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్ ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు” అని ఆమె తన డైరీలో రాసుకుంది.
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్(Pakistan) ను “క్రేజీ”, “రంగురంగుల పాకిస్థాన్” అని కూడా అభివర్ణించింది. పొరుగు దేశంలో తన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని చెప్పింది. ఒక ఎంట్రీలో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్(Pakistan) అధికారులకు చేసిన అభ్యర్థననూ రాసింది. “అక్కడి దేవాలయాలను రక్షించండి. 1947లో భారతీయులు తమ కుటుంబాల నుంచి విడిపోయిన వారి ఫ్యామిలీస్ను కలవనివ్వండి” అని కోరింది.
‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న 33 ఏళ్ల యూట్యూబర్ ఈ జ్యోతి మల్హోత్రా. ఆమె ఛానల్ కు 3.77 లక్షలకు పైగా సబ్స్క్రైబర్ లు ఉన్నారు. మే 16న హిసార్లోని ఆమె నివాసంలో దేశద్రోహం కేసులో అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్లు 3, 5 ఇంకా, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన పాకిస్తానీ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో నవంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకూ మల్హోత్రా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు హర్యానా పోలీసులు, దర్యాప్తు సంస్థలు కనుగొన్నారు. హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ మాట్లాడుతూ.. డానిష్తో టచ్లో ఉన్నట్లు మల్హోత్రా ఒప్పుకున్నారని తెలిపారు. డానిష్ “ఆమెను ఒక అసెట్ (ఆస్తి)గా పరిగణించాడని ఆయన అన్నారు.
దర్యాప్తు సంస్థలు పర్సనా నాన్ గ్రాటా(అప్రియమైన వ్యక్తి)గా ప్రకటించిన డానిష్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అలీ అహ్వాన్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత అలీ.. జ్యోతి మల్హోత్రాకు పాక్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు, పాకిస్థాన్ భద్రతా అధికారులు షకీర్, రాణా షాబాజ్లకూ పరిచయం చేసి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేశాడు.
జ్యోతి మల్హోత్రాపై నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం తెలుస్తోన్నదేంటంటే, తనపై ఎటువంటి అనుమానం రాకుండా ఉండటానికి జ్యోతి.. షకీర్ నెంబర్ని తన ఫోన్లో “జాట్ రంధావా”గా సేవ్ చేసింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత, మల్హోత్రా.. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా వాళ్లతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నట్లు తెలిసింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో డానిష్ను ఆమె చాలా సార్లు కలిసింది. జ్యోతి మల్హోత్రా.. హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉన్న పెద్ద గూఢచర్య నెట్వర్క్లో భాగమని, ఏజెంట్లు, ఇన్ఫార్మర్లు, ఫండ్స్ అందించే వాళ్లతో ఆమె సంబంధం కలిగి ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు అనేక లావాదేవీలతో కూడిన వివిధ బ్యాంకు ఖాతాలూ ఉన్నాయని, వీటన్నింటిని ఇప్పుడు జ్యోతి మల్హోత్రా టూర్ హిస్టరీతో పోల్చి కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశాంక్ కుమార్ సావన్ అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… జ్యోతి మల్హోత్రా కేవలం ట్రావెల్ బ్లాగర్ మాత్రమేనని “ఆమెకున్న ఇన్కం సోర్సెస్తో ఇన్ని టూర్స్ చేయలేదని, ఎక్కడి నుంచో ఫండ్స్ రావడం వల్లనే ఆమె ఇంత స్థాయిలో పర్యటనలు చేసిందని తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్ గూఢచర్య కార్యకలాపాలలో వాళ్ల.. వాళ్ల పాత్రలకు సంబంధించి మల్హోత్రాతోపాటు, గత రెండు వారాలలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు మరో 11 మందిని అరెస్టు చేశారు. ఇంకో యూట్యూబర్ గుజాలాను పంజాబ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక, మల్హోత్రా కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సీక్రెట్స్ బయటపడతాయో చూడాలి.
Also Read : Banu Mushtaq: ‘హార్ట్ల్యాంప్’ రచయిత్రి బాను ముస్తాక్ కు బుకర్ ప్రైజ్