Singareni: సింగరేణికి బంగారు అవకాశం వచ్చింది – సీఎండీ బలరామ్
సింగరేణికి బంగారు అవకాశం వచ్చింది - సీఎండీ బలరామ్
Singareni : సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటకలోని దేవదుర్గ్లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి (Singareni) ఎల్-1 బిడ్డర్గా నిలిచిందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని సీఎండీ బలరామ్ స్పష్టం చేశారు.
Singareni Gets Good Chance
కర్ణాటక దేవదుర్గ్ లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం ఈ గనులను మైనింగ్ కోసం వేలం వేస్తుంది. ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవిత కాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అన్వేషణ కోసం దాదాపు రూ.90 కోట్లు వ్యయం అవుతుండగా..అందులో రూ.20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తుంది.
Also Read : Rahul Gandhi: పోలీసు కానిస్టేబుల్ ను ఢీకొట్టిన రాహుల్ గాంధీ కారు
