Cloudburst: ఉత్తరాఖండ్లో మరో క్లౌడ్ బరస్ట్ ! గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు !
ఉత్తరాఖండ్లో మరో క్లౌడ్ బరస్ట్ ! గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు !
Cloudburst : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను ముంచెత్తుతోంది. ఉత్తరాఖండ్ లో తాజాగా మరోసారి మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా… పలుచోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుకుపోగా… పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి. మేఘ విస్ఫోటం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్ లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో (Cloudburst) 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి.
Cloudburst in Uttrakhand
కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా, రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ మొదలైన జిల్లాలోని విద్యాలయాలను మూసివేశారు. ఉత్తరాఖండ్లో భారీ వరదలు సృష్టిస్తున్న కల్లోలంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. రుద్రప్రయాగ్లోని బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో మేఘ విస్ఫోటం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయన్నారు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరువలో ఉండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
వరద ప్రవాహ ధాటికి ప్రజలు, అడవుల్లోని మూగజీవాలు సైతం భారీస్థాయిలో మృతిచెందుతున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. వరదల్లో గల్లంతైన వారి గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినా చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలతో తప్పించుకొనే మార్గం లేకపోయిందని వివరించారు. ఇటీవల ఉత్తరాఖండ్లోని రాంనగర్ పెద్ద కాలువలో వరద నీటి ధాటికి చిరుత పులి కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గ్రామాలలోని జంతువులు, పశువులు సైతం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి.
Also Read : CM Chandrababu: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
