CJI B R Gavai: తనపై దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ గవాయ్
తనపై దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ గవాయ్
CJI B R Gavai : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్పై దాడికి యత్నించిన ఘటన ఇటీవల కలకలం రేపింది. దీన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. ఆ ఘటనతో తొలుత తాను షాకయ్యానని తెలిపారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ (CJI B R Gavai) మాట్లాడుతూ… ‘‘సోమవారం నాటి ఘటనతో నేను, సహచర జడ్జి షాక్ అయ్యాం. అయితే, మా వరకు అది ఒక మర్చిపోయిన అధ్యాయం’’ అని అన్నారు.
CJI B R Gavai Respond
మరో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పందిస్తూ… ‘‘సీజేఐపై దాడికి యత్నించడాన్ని జోక్గా తీసుకోవద్దు. ఇది సుప్రీంకోర్టును అవమానించడమే. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే’’ అని అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఈ ఘటన క్షమార్హం కాదన్నారు. దీన్ని మర్చిపోయిన అధ్యాయం అనడం సీజేఐ గొప్పతనమని కొనియాడారు.
అక్టోబరు 6న ఈ ఘటన చోటుచేసుకుంది. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం కోర్టు నం.1లో వాజ్యాలపై విచారణను కొనసాగిస్తుండగా రాకేశ్ కిశోర్ (71) అనే న్యాయవాది వేదిక వద్దకు వచ్చారు. వెంటనే తన కాలికున్న బూటును తీసి విసరబోతుండగా భదత్రా సిబ్బంది అడ్డుకుని అతనిని బయటకు తరలించారు. ఈసమయంలో ఆ న్యాయవాది… ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు’ అని నినదించడం వినిపించింది. దాడి సమయంలో జస్టిస్ గవాయ్ మనోనిబ్బరంతో కనిపించారు. ‘ఇలాంటి బెదిరింపులు నా దృష్టిని మళ్లించలేవు. పనితీరును ప్రభావితం చేయలేవు’ అని కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులతో ఆయన అన్నారు.
CJI B R Gavai – లాయర్ రాకేశ్ కిశోర్ కు సుప్రీంకోర్టులోకి ప్రవేశం రద్దు
సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI B R Gavai) పై ఓ న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్ కిశోర్పై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ (SCBA) చర్యలు ప్రారంభించింది. రాకేశ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని, వృత్తిపరమైన నీతిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని కూడా కాలరాయడమేనని తెలిపింది. న్యాయవాది రాకేశ్ కిశోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై… పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. కాగా.. ఘటన నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రాకేశ్ కిశోర్ లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్ హామీ
