Saudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

 

 

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ బృందం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది.

ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. హజ్‌, ఉమ్రా మంత్రిత్వశాఖతో సహా సౌదీ అధికారుల సమన్వయంతో బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించేందుకు.. పనులను పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నజీర్‌ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి బృందం సౌదీని సందర్శిస్తోందని తెలిపింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ ఛటర్జీ కూడా వెళ్లనున్నట్లు వెల్లడించింది. మృతుల అంత్యక్రియల్లో ఈ బృందం పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించింది.

మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకొని మదీనాకు బయలుదేరగా మార్గమధ్యలో యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 45 మంది హైదరాబాద్‌ వాసులు సజీవ దహనమయ్యారు. డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు మాత్రమే బయటపడగలిగారు.

ఒకే కుటుంబంలో 18మంది మృతి బాధాకరం – మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

 

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్‌లోని నసీరుద్దీన్‌ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ తదితరులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్‌ చిన్న బావమరిది మహ్మద్‌ షాహీద్‌ను పలుకరించి ఓదార్చారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు.

 

నసీరుద్దీన్‌ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సౌదీలోని మదీనా మసీదులో వారి పేర్లపై అధికారికంగా ప్రార్థనలు జరిపి వారి ఆత్మకు శాంతి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానన్నారు. మాజీ హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు వారి బంధువులను వెంటనే సౌదీకి తీసుకెళ్లేలా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఆర్‌.శేషసాయి, అడిక్‌మెట్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు పాశం సాయికృష్ణయాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జైసింహ, సయ్యద్‌ ఆస్లాం, కె.సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!