Mahabubabad: కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవో కార్యాలయం జప్తు

కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవో కార్యాలయం జప్తు

 

 

న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో సామగ్రిని జప్తు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన కొరిపల్లి శ్రీనివాసరెడ్డి, సాధు ధర్మారెడ్డి, కొరిపల్లి వెంకన్న వ్యవసాయ భూమిలో నుంచి ఎస్సారెస్పీ కాలువ వెళ్లడంతో తొమ్మిది ఎకరాలు నష్టపోయారు. దీనిపై తమకు సరైన నష్టపరిహారం అందలేదని 2011లో వారు కోర్టును ఆశ్రయించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్‌ రఫీ ముగ్గురు రైతులకు రూ.7.14 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2024లో తొర్రూరు ఆర్డీవోను ఆదేశించారు. దీనిని సవాల్‌ చేస్తూ ఆర్డీవో హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు జిల్లా న్యాయస్థానం తీర్పును సమర్థిస్తూ.. రైతులకు ఇచ్చే పరిహారంలో తొలుత యాభై శాతాన్ని కోర్టులో డిపాజిట్‌ చేయాలని సూచించింది. కానీ ఆ ఆదేశాలు అమలు చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు రైతులు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు సొమ్ము చెల్లించని పక్షంలో కార్యాలయంలో సామగ్రిని జప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోర్టు సిబ్బంది పర్యవేక్షణలో ఆర్డీవో కార్యాలయానికి చెందిన బీరువాలు, కంప్యూటర్‌లు, కుర్చీలు, ఇతర పత్రాలను జప్తు చేసి రెండు వాహనాల్లో తీసుకెళ్లి భద్రపరిచారు. ఈ ఘటనపై తొర్రూరు ఆర్డీవో గణేష్‌ను వివరణ కోరగా స్పందించలేదు.

Leave A Reply

Your Email Id will not be published!