హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో బీజేపీ ఆపరేషన్ కొనసాగుతుందని, వచ్చేసారి శాసన సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో వెల్లడి అయిన ఫలితాలు ఇక్కడ కూడా వస్తాయని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై దోపిడీ, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాంటూ మండిపడ్డారు. ఆయా పార్టీలను జనం నమ్మే స్థితిలో లేరన్నారు నితిన్ నబిన్. ఆరు హామీల’ను నెరవేర్చకపోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆరోపించారు. 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తరహా ఫలితాలే వస్తాయని జోష్యం చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల బూత్ స్థాయి పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం చొరవతో కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీలోనే కొత్త వందే భారత్ రైళ్లు తయారవుతాయని నబిన్ తెలిపారు. గతంలోని యూపీఏ ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్లో రూ. 400 కోట్లతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును కేంద్రం ప్రకటించిందని నబిన్ వెల్లడించారు. అలాగే అంబర్పేటలో కీలకమైన ఫ్లైఓవర్ (సుమారు రూ. 400 కోట్లు), బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రి, అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ (రూ. 700 కోట్లు), ఎంఎంటీఎస్ ఫేజ్-2కు నిధులు, రాష్ట్రంలో 100 కి.మీ రైలు మార్గం వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
