అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం మీ మార్ట్స్ ను ప్రారంభిస్తోంది. ఇందులో మొత్తం 64 నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ధరల స్థిరీకరణలో భాగంగా వస్తువులను సరసమైన ధరలకు విక్రయించేందుకు, రేషన్ దుకాణాలను రాయితీ ధరలతో కూడిన నిత్యావసర వస్తువులు లభించే ‘మీ మార్ట్స్’గా ఏపీ ప్రభుత్వం అప్గ్రేడ్ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కాకినాడలోని మెయిన్ రోడ్ , రామారావుపేటలో ఉన్న సూపర్ బజార్లలో ప్రత్యేక రాయితీ బియ్యం కౌంటర్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ఆహార పదార్థాల ధరల నుండి పేద , మధ్యతరగతి కుటుంబాలను రక్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా రవాణా, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే బియ్యం ధరలు ఇటీవల పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో చర్చల అనంతరం, ప్రభుత్వం కిలో బిపిటి స్టీమ్ బియ్యాన్ని రూ. 52కు , బిపిటి ముడి బియ్యాన్ని రూ. 59కు సరఫరా చేయడం ప్రారంభించిందని చెప్పారు. ప్రతి కుటుంబం ఒక్కో రకానికి సంబంధించి గరిష్టంగా 10 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. కాకినాడ నగరంలో ఇప్పటికే ఏడు విక్రయ కేంద్రాలు పని చేస్తున్నాయని, ప్రజల డిమాండ్ ఆధారంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మనోహర్ చెప్పారు. అలాగే కాకినాడ జిల్లాలో 10 శాతం వరకు నూకలు కలిగిన ప్రీమియం నాణ్యత గల బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ను ప్రకటించారు .
దేశంలోనే ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కార్యక్రమం ప్రారంభించిన ఐదు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14,000 క్వింటాళ్ల బియ్యం అమ్ముడయ్యాయని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం కింద 42,000 ప్రభుత్వ పాఠశాలలు , 4,000 సంక్షేమ వసతి గృహాలకు కూడా ప్రభుత్వం 25 కిలోల బస్తాలలో ప్రీమియం నాణ్యత గల బియ్యాన్ని సరఫరా చేస్తోందని చెప్పారు. త్వరలో ఈ కేంద్రాల ద్వారా కందిపప్పు , పామాయిల్ కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆధార్ ఉన్నవారు రాయితీ ధరకే బియ్యం పొందవచ్చు అని పేర్కొన్నారు.
