‘తమిళ తల్లి ప్రార్థన గీతం’పై తమిళనాడు తీర్మానం
తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రజా సంస్థలలో కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని తప్పనిసరిగా మొదట ఆలపించాలని కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర కార్యక్రమాల్లో ‘తమిళ్ తాయ్ వాజ్తు’ (తమిళ తల్లి ప్రార్థన గీతం) తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. తమిళం ప్రపంచంలోని అత్యంత పురాతన శాస్త్రీయ భాషలలో ఒకటి అని, తమిళ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతన సాంస్కృతిక సంప్రదాయాలలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.
రాష్ట్ర గీతాలాపనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 9న రాసిన లేఖలోని అంశాల నేపథ్యంలో ఈ తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు జోసెఫ్ విజయ్. తమిళ్ తాయ్ వాజ్తు అనేది తమిళ భాష , సంస్కృతి పట్ల గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. అంతే కాకుండా భారత రాజ్యాంగం కల్పించిన భాషా , సాంస్కృతిక హక్కులకు అనుగుణంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు ముందు ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించడం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తమిళనాడు సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించే ఉద్దేశంతో… తమిళనాడులోని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రజా సంస్థలు నిర్వహించే కార్యక్రమాల ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను తప్పనిసరిగా మొదట ఆలపించాలని తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.