ముంబై : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై వేదికగా ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు సీఎం. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత నేను ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశానని చెప్పారు. సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ను అమలు చేశాం అని వెల్లడించారు. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవేనని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశారని కొనియాడారు.
అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్షఅని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అంది పుచ్చుకున్నాం అన్నారు. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయన్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు సీఎం. గతంలో విద్యుత్ సంస్కరణల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం అన్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణా కమిషన్ ను కూడా తీసుకు వచ్చామని తెలిపారు. సౌర, పునరుద్పాదక విద్యుత్ కు కూడా పెద్ద ఎత్తున భారత్ లో ప్రోత్సాహం కల్పించడం జరిగిందన్నారు సీఎం.
