Lawyer Rakesh Kishore: దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు – రాకేశ్‌ కిశోర్‌

దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు - రాకేశ్‌ కిశోర్‌

Lawyer Rakesh Kishore : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై కోర్టు రూమ్‌లో సోమవారం బూటు విసిరేసిన ఘటనపై న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ (Lawyer Rakesh Kishore) స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి చింతా లేదని తెలిపారు. అంతేకాదు… తన చర్యను సమర్థించుకున్నారు. ‘‘విష్ణుమూర్తి విగ్రహం’ పిల్‌పై సీజేఐ చేసిన వ్యాఖ్యలతో నా మనసు గాయపడింది. ‘వెళ్లు… తలను పునరుద్ధరించమని ఆ విగ్రహాన్నే వేడుకో!.’ అని సీజేఐ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి. ఇదొక్కటే కాదు. జల్లికట్టు, నూపుర్‌ శర్మ, ఉట్టి ఎత్తు(శ్రీకృష్ణ జన్మాష్ఠమి రోజు నిర్వహిస్తారు)లపై దాఖలైన పిటిషన్లపై ఇచ్చిన ఆదేశాలు కూడా నన్ను మనోవేదనకు గురిచేశాయి. ఇతర మతాలకు సంబంధించిన పిటిషన్లపై మాత్రం కోర్టు భిన్నంగా స్పందిస్తోంది.’’ అని రాకేశ్‌ (Lawyer Rakesh Kishore) వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మానికి సంబంధించిన పిటిషన్లలో పరిష్కారం చూపకపోయినా ఫర్వాలేదని, కానీ, అవహేళన మాత్రం చేయొద్దన్నారు. ‘‘తొలుత ఆయన సనాతనుడు. తర్వాత బౌద్ధంలోకి మారారు. ఇప్పుడు ఆయన దళిత బిడ్డనని చెప్పుకొంటారు. ఆయన దళితుడా?. ఇదీ వాళ్ల రాజకీయం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ క్షమాపణలు చెప్పను. భగవంతుడే నాతో ఈ పనిచేయించాడు. ఆయనే (దేవుడు) నన్ను జైలుకు పంపించినా వెళ్తా. లేదా.. ఉరి వేయించినా భరిస్తా. అంతా ఆయన ఇష్టం’’ అని చెప్పారు.

Lawyer Rakesh Kishore – ఏదో సరదాగా అన్నంత మాత్రాన – సీజేఐ గవాయ్‌

కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (Justice BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వీస్‌ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్‌ ఇండియా జడ్జెస్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌తో కలిసి జస్టిస్‌ గవాయ్‌ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కే వినోద్‌తో తన గత అనుభవాన్ని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు.

‘ఇటీవల ధీరజ్‌ మోర్‌ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్‌ కే వినోద్‌ని ఉద్దేశించి) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్‌ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.

‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్‌ గవాయ్‌ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్‌ గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది.

Also Read : Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Leave A Reply

Your Email Id will not be published!