PM Narendra Modi: ‘సందేశ్ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్ ! ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస !
‘సందేశ్ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్ ! ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస !
PM Narendra Modi: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితురాలు రేఖ పత్రాను బీజేపీ(BJP) లోక్ సభ బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫోన్ లో మాట్లాడారు. ఆమెను ‘శక్తి స్వరూపం’గా అభివర్ణించిన ప్రధాని… ఎన్నికల సన్నాహాలతోపాటు ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులు, తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆగడాల గురించి ఆమె ప్రధానికి వివరించినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు… మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా… వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరికి వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలకు రేఖ పత్రా నాయకత్వం వహించారు. టీఎంసీ నేతల అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన ఆమెను లోక్ సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా బీజేపీ(BJP) ప్రకటించింది. బసిర్ హట్ స్థానం నుంచి అవకాశం కల్పించింది. ఈ లోక్ సభ స్థానం పరిధిలోనే సందేశ్ఖాలీ గ్రామం ఉంది. బసిర్హట్ నియోజకవర్గానికి ప్రస్తుతం తృణమూల్ నేత, నటి నుష్రత్ జహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను పక్కనబెట్టిన అధికారపార్టీ… వేరే వ్యక్తికి అవకాశం కల్పించింది.
PM Narendra Modi – ప్రధాని మోదీ… రేఖ పత్రాల ఫోన్ సంభాషణ ఇదే !
ప్రధాని మోదీ: సందేశ్ఖాలీ ప్రజలు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
రేఖ పత్ర : తృణమూల్ కాంగ్రెస్ షాజహాన్ షేక్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి.
ప్రధాని మోదీ : బసిర్హట్ నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యతను మీకే అప్పగించాం.
రేఖపత్ర : సందేశ్ఖాలీ మహిళల పట్ల మీరు దేవుడిలాంటి వారు. ఆ రాముడే మాతో ఉన్నట్లు భావిస్తున్నాం.
ప్రధాని మోదీ: వారి ఆశీసులు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళామణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపిక పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?
రేఖ పత్ర : మొదట మీరు నన్ను లోక్సభ అభ్యర్ధిగా ప్రకటించడంపై పలువురు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే వాళ్లల్లో చైతన్యం కలిగింది. తృణముల్ కాంగ్రెస్ నేతల సూచనల మేరకే తాము ఇలా ఆందోళన చేశామని, ఇకపై ఇలా చేయబోమని హామీ ఇచ్చారు. వారితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తా.
ప్రధాని మోదీ : మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి బాగు కోసం పని చేప్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం.
రేఖ పత్ర : నాకు ప్రజా మద్దతు లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ‘నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పనిచేస్తున్నారు. మేం బతకడానికి చాలా కష్టపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు పని లభించేలా, వారు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నారు.
ప్రధాని మోదీ : మీ గెలుపు ఖాయం. ‘మీరు శక్తి స్వరూపిణి. శక్తివంతమైన నేతను జైలుకే పంపారు. బసిర్హట్లోనే కాదు, వెస్ట్ బెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడుదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంది’. ‘బెంగాల్ దుర్గా మాత నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్ఖాలీ మహిళలు గొంతు ఎత్తడం అంత సులభం కాదు. ఈసారి బెంగాల్లోని నారీశక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం’ అంటూ ప్రధాని మోదీ బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో సంభాషణ ముగించారు.
Also Read : AP CM YS Jagan : రేపటి నుంచి 21 రోజులు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర