S Jaishankar: ఉగ్రవాదులకు రూల్స్‌ ఉండవు – కేంద్ర మంత్రి జై శంకర్‌

ఉగ్రవాదులకు రూల్స్‌ ఉండవు - కేంద్ర మంత్రి జై శంకర్‌

S Jaishankar: ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్‌ ఉండవని… అలాంటప్పుడు వారి భాషలోనే ముష్కరులకు బదులివ్వాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని తెలిపారు. ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు… దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందన్నారు. గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ అన్నారు.

S Jaishankar Comment

మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌(S Jaishankar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాల వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా… పొరుగున ఉన్న పాకిస్థాన్‌ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాదిని ఉద్దేశిస్తూ మరోసారి తేల్చి చెప్పారు.

‘‘పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని మనం మొదట్నుంచీ స్పష్టంగా ఉంటే అప్పుడు భారత విదేశాంగ విధానం భిన్నంగా ఉండేది. అయితే 2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చింది. అది కూడా ఉగ్రవాదంపై మనం స్పందించే తీరులోనే. ముంబయి దాడుల తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ స్పందించడమే సరైందని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో పాకిస్థాన్‌పై దాడి చేయడం కంటే… చేయకపోవడమే వల్లే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ, 26/11 ముంబయి పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే… తర్వాతి దాడులను మనం ఎలా నిరోధించగలం ?’’ అని జైశంకర్‌ అన్నారు.

‘‘సరిహద్దులకు ఆవల ఉన్నాం కదా… మనల్ని ఎవరూ టచ్‌ చేస్తారని ముష్కరులు అనుకుంటున్నారు. అది నిజం కాదని మనం రుజువు చేయాలి. ఉగ్రవాదులు ఎలాంటి రూల్స్‌ పెట్టుకుని దాడులు చేయరు… అలాంటప్పుడు వారి చర్యలకు ప్రతిచర్యలు కూడా ఎలాంటి నియమాలకు లోబడాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి జై శంకర్ అభిప్రాయం వ్యక్తం చేసారు.

Also Read : Chipko Movement: చిప్కో ఉద్యమనేత మురారి లాల్‌ మృతి !

Leave A Reply

Your Email Id will not be published!