విశాఖపట్నం జిల్లా : రాబోయే రోజుల్లో గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖపట్నం మారబోతోందని చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం విశాఖ సమీపంలో గూగుల్ డేటా సెంటర్కు నాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఒక భారీ ‘మల్టీ-గిగావాట్’ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో, ఇతర ప్రైవేట్ భాగస్వాములతో కలిసి తర్లువాడ, అడవివరం, రాంబిల్లి గ్రామాల్లోని 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ , కేంద్ర మంత్రులు, గూగుల్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విశాఖపట్నం సమీపంలో 15 బిలియన్ డాలర్ల విలువైన గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. 1 గిగా వాట్ సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్ భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల వృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని చెప్పారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు.
దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లలో ఒకటిగా ఇది గుర్తింపు పొందనుందని, అధునాతన ఏఐ క్లౌడ్ మౌలిక సదుపాయాలను, భారీ స్థాయి డేటా నిల్వ సామర్థ్యాలను ఇది అందిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ‘డేటా హబ్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో, సుమారు 6.5 గిగావాట్ల మొత్తం సామర్థ్యంతో కూడిన ఒక భారీ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడం జరిగిందని వెల్లడించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గూగుల్ తో భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందన్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కనెక్స్ , ఎయిర్ టెల్ నెక్స్ ట్రా సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు, యువతకు ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నానని అన్నారు. ఉక్కు నగరంగా పేరు పొందిన విశాఖ ఇక డేటా సిటీ అవుతుందన్నారు.
