అమరావతి : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబాటు ధరలు, సమయానికి విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సదుపాయాలు అందిస్తూ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం వాస్తవాలను వక్రీకరించి అబద్ధాల ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. వైసీపీ పాలనలో రైతులు అప్పుల భారంతో నలిగి పోవడం, పంటలకు సరైన ధరలు దక్కక రోడ్డెక్కిన ఘటనలు ప్రజలు మర్చి పోలేదని అన్నారు. ఆ కాలంలో వ్యవసాయం క్షీణించి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కనీస మద్దతు ధర అమలులో కట్టుబడి ధరల స్థిరీకరణ నిధి (PSF) ద్వారా రైతులను ఆదుకుంటూ 2025–26లో రూ.300 కోట్ల కేటాయిస్తే సుమారు రూ.588 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు . అందులో పోగాకు (రూ.240 కోట్లు), మామిడి (రూ.190 కోట్లు), ఉల్లి కొనుగోలు (రూ.17.20 కోట్లు), ఉల్లి నష్టపరిహారం (రూ.128.33 కోట్లు), కోకో (రూ.12 కోట్లు) వంటి పంటలకు ప్రత్యక్ష మద్దతు అందించామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. 25 వేలు ఉన్న ఉల్లి నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.50 వేల వరకు పెంచి రైతులకు ఉపశమనం కల్పించామని, ప్రస్తుతం మొక్కజొన్న సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో నిరంతరం చర్చలు జరుపుతూ రైతులకు అనుకూల నిర్ణయం తీసుకు రాబోతున్నామని వెల్లడించారు.
