Sunita Williams: అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్
అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్
Sunita Williams : తొమ్మిది నెలల మహా ఉత్కంఠకు తెరపడింది. యావత్ ప్రపంచం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత(India) సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ లు… భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో క్షేమంగా దిగారు. స్పేస్ఎక్స్కు(SpaceX) చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’.. వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత(Sunita Williams), విల్మోర్లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు.
Sunita Williams Safe Landing on Earth
క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీతా విలియమ్స్ అభివాదం చేస్తూ వైద్య పరీక్షలు నిమిత్తం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడే వారికి కొన్ని రోజులు పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు. సుదీర్గకాలం స్పేస్లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్యలను ఎప్పటకప్పుడు వైద్యులు పరీక్షించనున్నారు. దీనితో తన మూడో అంతరిక్ష యాత్రను సైతం సునీతా విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లయింది. గతంలో 2006,2012లలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను సునీతా విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసారు.
కేవలం 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం గత ఏడాది జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్… చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం. పుడమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు సునీత, విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ ఘనంగా వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని… అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు (హ్యాచ్) మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10.15 గంటలకు క్రూ డ్రాగన్.. ఐఎస్ఎస్తో విడిపోవడం (అన్డాకింగ్) మొదలైంది. 10.35 గంటలకు పూర్తిగా విడిపోయింది.
అనంతరం ఆ క్రూ డ్రాగన్ భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే- భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా కోసం క్రూ డ్రాగన్ ముందుభాగంలోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది. ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం (రీ ఎంట్రీ) కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీ ఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ అయింది. రీ ఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటిగ్రేడ్ల వేడి ఉత్పన్నమై… వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దీనితో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి (రేడియో సైలెన్స్) ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణ కవచం సమర్థంగా పనిచేసి… ఆ వేడిని తట్టుకుంది. రీ ఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో… కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.
సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్ ప్రారా చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్ చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే… సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్ లో చప్పట్లు మార్మోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక.. వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు.
ఆ తరువాత లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్(SpaceX) సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత… ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.
ఫ్లోరిడా సముద్రజలాల్లో దిగిన క్రూ డ్రాగన్ మాడ్యూల్ షెడ్యూల్ ఇదే
2.17: స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ షురూ
2.18: లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్ పూర్తి
2.35: కక్ష్య నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది.
2.51: కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ పూర్తయి.. స్పేస్క్రాఫ్ట్ కిందకు దిగడం ప్రారంభమైంది.
3.10: డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ భూవాతావరణంలోకి ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్తో సిగ్నల్ కట్ అయింది. 3.21కి సిగ్నల్ కలిసింది.
3.26: భూమికి 5 కి.మీ. ఎత్తులో ఉండగా పారాచూట్లు తెరుచుకున్నాయి.
3.28: డ్రాగన్ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది.
3.55: మాడ్యూల్ను నౌకలో ఎక్కించారు.
4.23: మాడ్యూల్ నుంచి సునీతను బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు
Also Read : CM Chandrababu Naidu: అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం