Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar)…చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ను ఉద్దేశించి… పొన్నం (Ponnam Prabhakar) ఈ వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ వ్యాఖ్యలపై లక్ష్మణ్‌ కుమార్‌ కూడా ఓ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. తనపై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని, మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని అందులో ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని పొన్నం (Ponnam Prabhakar) పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే చెందిన ఈ ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న విభేదాలు… ఇప్పుడు బహిర్గతమయ్యాయన్న చర్చ జరుగుతోంది.

Minister Ponnam Prabhakar – అసలు ఏం జరిగిందంటే ?

ఈ నెల 5న జూబ్లీహిల్స్‌ పరిధిలోని రహమత్‌నగర్‌ లో జరిగిన ఓ సమావేశంలో మంత్రులు పొన్నం, వివేక్‌ పాల్గొన్నారు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ రావడం ఆలస్యమైంది. ఆయన రాక ఆలస్యంపై పొన్నం చేసిన వ్యాఖ్యలు మైక్‌ ఆన్‌ లో ఉండటంతో బయటకు వినిపించాయి. తన బాడీ షేమింగ్‌ పై పొన్నం క్షమాపణ చెప్పాలంటూ లక్ష్మణ్‌కుమార్‌ దీనిపై వీడియో విడుదల చేశారు. ‘నాకు పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం రాదు. ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా… పొన్నం (Ponnam Prabhakar) తన తప్పు తెలుసుకుంటారని భావించాను… కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు.. మంత్రి వివేక్‌ లాగా నా దగ్గర డబ్బులు లేవు. మాదిగలంటే చిన్న చూపా ? ఆ సామాజికవర్గంలో పుట్టడమే నేను చేసిన తప్పా ? నేను పక్కనుంటే వివేక్‌ ఓర్చుకోవడం లేదు, నేను కూర్చుంటే ఆయన లేచి వెళ్లిపోతున్నారు. త్వరలో సోనియా, రాహుల్, ఖర్గేలను కలిసి ఈ పరిణామాలను వివరిస్తా’ అని వీడియోలో పేర్కొన్నారు.

దీనితో ఈ విషయంపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌ లక్ష్మణ్‌ కుమార్‌తో ఫోన్‌ లో మాట్లాడారు. ఈ విషయం తనకు వదిలేయాలని భరోసా ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఇద్దరు మంత్రులతోనూ మాట్లాడినట్లు తెలిసింది. ఇలాంటివి పార్టీకి నష్టం కలిగిస్తాయని.. ఇద్దరూ సహకరించుకుంటూ ముందుకు పోవాలని సూచించినట్లు తెలిసింది. తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఓ టీవీ ఛానల్‌తో పొన్నం పేర్కొన్నారు. కావాలనే కొందరు వక్రీకరించి వివాదాస్పదం చేశారన్నారు. ఈ విషయంపై అసలేం జరిగిందో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వివరించానని, అక్కడితో ఈ వివాదం ముగిసిందన్నారు.

మహేశ్‌కుమార్‌గౌడ్‌తో ఎమ్మెల్యేల భేటీ

మంగళవారం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్‌తో లక్ష్మణ్‌కుమార్‌ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య భేటీ అయ్యారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడానని, సమస్య సద్దుమణిగిందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ వారికి తెలిపారు. బుధవారం మరోసారి మాట్లాడతానని వివరించారు.

పీసీసీ సమావేశంలో సమసిపోతుందని భావిస్తున్నా – అడ్లూరి

తనకు ఎదురైన బాధాకరమైన విషయం బుధవారం జరగనున్న పీసీసీ సమావేశంలో సమసిపోతుందని భావిస్తున్నానని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ధర్మపురిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ పొన్నం వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాష తనను బాధకు గురి చేసిందన్నారు. దీనిపై మహేశ్‌కుమార్‌గౌడ్‌, మీనాక్షీ నటరాజన్‌లు బుధవారం తనను పిలిచారని.. అక్కడే ఈ అంశం సమసిపోతుందని భావిస్తున్నానన్నారు. ఈ అంశంలో దళిత సంఘాలన్నీ తనకు సంఘీభావం వ్యక్తం చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. మరో మంత్రి వివేక్‌ స్పందించకపోవడం కొంత బాధకు గురి చేసిందన్నారు.

Also Read : Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Leave A Reply

Your Email Id will not be published!