అమరావతి : మైనార్టీలకు తీపి కబురు చెప్పింది ఏపీ సర్కార్. భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్–2027 (1448 హిజ్రీ) నోటిఫికేషన్ను రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ సహకారంతో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర హజ్ కమిటీ కట్టుబడి ఉందన్నారు.
హజ్–2027 దరఖాస్తులను జూన్ 22న ప్రారంభమైందని ఈ ప్రక్రియ 20 జూలై 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు హజ్ సువిధ యాప్ లేదా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు 31-12-2027 వరకు చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ట్, తెలుపు నేపథ్యంతో పాస్పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్బుక్ లేదా రద్దు చేసిన చెక్కు, చిరునామా ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూలై చివరి వారంలో నిర్వహించే ఖుర్రా (డిజిటల్ లాటరీ) అనంతరం ఎంపికైన యాత్రికులు రూ.1,52,300/- అడ్వాన్స్ మొత్తాన్ని 10 ఆగస్టు 2026లోపు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. హజ్ సీట్ల రద్దు వల్ల పరిపాలనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, యాత్రకు పూర్తి సిద్ధత , దృఢ సంకల్పం ఉన్నవారే దర. ఖాస్తు చేసుకోవాలని హసన్ బాషా సూచించారు.
