Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బంది ఇద్దరు చిన్నారులను రక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగతావారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బస్సు మరోతాన్‌ నుంచి ఘుమారవీకి వెళ్తుండగా.. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాలూఘాట్‌ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో డ్రైవర్, కండక్టర్‌ కూడా ఉన్నారు. విరిగిపడ్డ కొండచరియలు బస్సును పూర్తిగా కప్పేశాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. బాలూఘాట్‌ ప్రాంతంలో సోమవారం నుంచి వర్షం కురుస్తూ, ఆగుతూ ఉంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు ప్రయాణికులను కాపాడినట్టు బిలాస్‌పూర్‌ డిప్యూటీ కమిషనర్‌ రాహుల్‌కుమార్‌ తెలిపారు. శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీసినట్టు ఝన్‌దత్త ఎమ్మెల్యే జేఆర్‌ కత్వాల్‌ చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయచర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రి సమయం కావటంతో సెల్‌ఫోన్లు, టార్చిలైట్ల వెలుగులో సహాయక చర్యలు చేపట్టారు. ఒక జేసీబీతో శిథిలాలను తొలగిస్తుండగా, సహాయక సిబ్బంది మరోవైపు పారలతో మట్టిని తవ్వి బస్సులోనివారి కోసం వెదుకుతున్న వీడియోలు మీడియాలో ప్రసారమయ్యాయి.

Himachal Pradesh – విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం సుఖ్విందర్

బిలాస్‌పూ (Bilaspur)ర్‌ ప్రమాదంపై హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh) ముఖ్యమంత్రి ఠాకూర్‌ సుఖ్విందర్ సింగ్ సుక్కు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్స్‌లో తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సకల వనరులు ఉపయోగించి సహాయక చర్యలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రయాణికుల మరణంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పన ఆర్థికసాయం ప్రకటించారు. సుఖ్విందర్ సింగ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Also Read : Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Leave A Reply

Your Email Id will not be published!