Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్ హామీ
ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం - తేజస్వీ యాదవ్ హామీ
Tejashwi Yadav : బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అధికారం కోసం ప్రజలపై రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మరో అడుగు ముందుకు వేసి… రాష్ట్ర ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చిన ఇండి కూటమి అధికారంలోకి వస్తే… రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన 20 రోజుల్లోనే అందుకు సంబంధించిన చట్టం తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బిహార్ (Bihar) రాజధాని పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వెల్లడించారు.
Tejashwi Yadav Comments
‘‘20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీయే (NDA) ఉద్యోగాలు కల్పించలేకపోయింది. మేం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు ఐదేళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తోనో మీరే ఊహించుకోవచ్చు’’ అని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ను కాపీక్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలిఉన్నాయని ఆరోపించారు. బిహార్ లో జాబ్ లేకుండా ఏ ఇల్లు ఉండడానికి వీల్లేదన్నారు. ఈ రోజు తాను చేసింది. చారిత్రాత్మక ప్రకటనగా ఆయన అభివర్ణించారు. బిహార్ను ప్రగతి పథంలో ఎలా తీసుకు వెళ్లాలంటూ అంతా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే ఏన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాలైన జేడీయూ కానీ… బీజేపీ కానీ ఉద్యోగాలపై ప్రజలకు హామీలు ఇవ్వడం లేదని చెప్పారు. కానీ నిరుద్యోగ భృతిపై మాత్రం ఆ యా పార్టీలు హామీలు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబాలకు.. ఈ కొత్త చట్టం ద్వారా అవకాశం లభిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే.. ప్రభుత్వ ఉద్యోగం లేని ఇల్లు బిహార్లోనే ఉండదని తెలిపారు. ఇది తన ప్రతిజ్ఞగా తేజస్వీ యాదవ్ అభివర్ణించారు. అదీకాక బిహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఆ క్రమంలో సామాజిక న్యాయంతోపాటు బిహార్ ప్రజలకు ఆర్థిక న్యాయం కూడా అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇస్తున్నామన్నారు.
బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో.. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, ఇండి కూటమిలోని పార్టీలతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురజ్ బరిలో దిగనుంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి బిహార్ ఓటర్లు పట్టం కట్టారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 14వ తేదీన తేలనుంది.
బిహార్ లో కొలిక్కొచ్చిన ఎన్డీయే కూటమి సీట్ల పంపకం
త్వరలో బిహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 13న ఎన్డీయే పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పక్షాల మధ్య సీట్ల పంపకం విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఎన్డీయే వర్గాలు తెలిపాయి. బీజేపీ, జనతాదళ్ (యూ), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ సంయుక్తంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నాయి. ఈసారి సీట్ల పంపిణీ బాధ్యతను ఎన్డీయే పక్షాలు జేడీ(యూ)కు అప్పగించాయి. చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాతో చర్చలు జరిపే బాధ్యతను కూడా జేడీయూ తీసుకుంది. ప్రస్తుతం చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ఎన్నికల ఏర్పాట్లను బీజేపీ దాదాపుగా పూర్తి చేసింది. అక్టోబర్ 12న పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ప్రతి నియోజక వర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిపై ఢిల్లీలో చర్చ అనంతరం తుది అభ్యర్థులతో కూడిన జాబితాను ఖరారు చేస్తారు. తొలుత ఢిల్లీలో అక్టోబర్ 11న రాష్ట్రానికి చెందిన పార్టీ కోర్ గ్రూప్ సమావేశం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
Also Read : IPS Suicide: ఐపీఎస్ పూరన్ కుమార్ భార్యకు సీఎం పరామర్శ
