ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా

పార్లమెంటులో ప్రశ్నించిన గురుమూర్తి

న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో జరిగిన ఓఎన్‌జీసీ చమురు బావి పేలుడు ఘటనపై పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తారు. ఏపీలోని మోరి5 క్షేత్రంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన పనుల సమయంలో గ్యాస్ లీక్‌తో పాటు చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం గురించి నిల‌దీశారు. ఈ ఘటనకు ముందు అక్కడ తప్పనిసరిగా అమలు చేయాల్సిన భద్రతా తనిఖీలు, పరికరాల సర్టిఫికేషన్, ఒత్తిడి పరీక్షలు, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయా అని ఎంపీ అడిగారు. అలాగే ఈ ప్రమాదానికి ఓఎన్‌జీసీ అధికారులు లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా అని పేర్కొన్నారు. ఎవరైనా బాధ్యులపై చర్యలు తీసుకున్నారా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వెల్లడించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

దీనిపై స‌మాధానం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. జ‌న‌వ‌రి 5న ఏపీలోని మోరి -5 చ‌మురు క్షేత్రంలో వ‌ర్క్ ఓవ‌ర్ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో గ్యాస్ లీక్ జ‌రిగింద‌ని ఒప్పుకున్నారు. ఈ క్షేత్రాన్ని 15 సంవత్సరాల ప్రొడక్షన్ ఎన్‌హాన్స్‌మెంట్ కాంట్రాక్ట్ కింద ఏప్రిల్ 3, 2025 నుంచి ఎం/ఎస్ డీప్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నదని స్ప‌ష్టం చేశారు.
ఘటన జరిగిన వెంటనే ఓఎన్‌జీసీ తన సాంకేతిక నిపుణుల సహాయంతో ఐదు రోజులలోనే మంటలను అదుపులోకి తెచ్చి బావిని సురక్షితంగా మూసి వేసిందని సురేష్ గోపి చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేదా ఎవరికీ గాయాలు ఏవీ జరగలేదని అన్నారు.. క్షేత్రాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించినప్పటి నుంచి డీజీఎంఎస్ వంటి చట్టబద్ధ సంస్థలు తరచూ భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!