హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో షోరూం యజమానులు సరైన భద్రతా చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సీరియస్ గా స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ మేరకు గురువారం ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. షో రూంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతే కాకుండా నగరంలో షాపులతో పాటు వాణిజ్య సముదాయాల్లో హైడ్రా కమిషనర్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో ఉన్న నీరూస్ షోరూంను సందర్శించారు. యజమాని నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులకు తోడు పైన అనుమతి లేని రూఫ్ షెడ్డు వేసి వస్త్రాలతో నింపేయడాన్ని హైడ్రా కమిషనర్ సీరియస్గా పరిగణించారు. రెండు అంతస్తుల్లో అమ్మకాలు, పైన మూడు అంతస్తుల్లో వస్త్రాల తయారీ, గోదాములా పెద్దమొత్తంలో నిలువలు ఉంచడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైర్ ఎన్వోసీ లేకుండా షాపులను నిర్వహిస్తున్నట్టు కమిషనర్ తనిఖీల్లో తేలింది. ఫైర్ నిబంధనలను పాటించక పోవడమే కాకుండా.. ఫైర్ ఎక్స్టింగ్విషర్ (మంటలను ఆర్పేది) లు కూడా సరిగా లేకపోవడాన్ని గమనించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించక పోవడంతో సీజ్ చేయాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. హైడ్రా, ఫైర్, జీహెచ్ ఎంసీ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు ఈ తనిఖీల్లో ఉన్నారు. ఫైర్ అన్ సేఫ్ షాపుగా పేర్కంటూ బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా.. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. విద్యుత్ అధికారులు పవర్ సప్లైను బంద్ చేశారు.
