విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు , మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. విజయవాడలో షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు జగన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలంటే ఇలాగే కామెంట్స్ పోతూ, పాదయాత్ర చేస్తానంటే జనం నమ్మరని పేర్కొంది. ముందు తన సోదరుడిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలా జరిగితేనే తను ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నారు. జనం ఆస్తుల కంటే తమ మధ్య ఉండే నాయకుడిని ఇష్ట పడతారని ఆ విషయం తను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు షర్మిలా రెడ్డి.
గతంలో కొందరి కోటరి కారణంగా తను ప్రజల్లోకి అందుబాటులోకి రాలేక పోయాడని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేశానంటూ గొప్పలు పోయారని, కానీ ప్రజల్లో తన పట్ల, తన అనుచరగణం చేస్తున్న అరాచకాల పట్ల గుర్తించక పోవడం వల్లనే వైసీపీ దారుణంగా ఓటమి మూటగట్టుకుందని , ఆ విషయం ఇకనైనా తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు షర్మిలా రెడ్డి. ఏది ఏమైనా ఇప్పుడు కొలువు తీరిన ఏపీ సర్కార్ ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చింది కాక జనం నెత్తిన శఠగోపం పెట్టారంటూ ఏకి పారేశారు ఏపీపీసీసీ చీఫ్. జగన్ రెడ్డిలో మార్పు వచ్చేలా ఆ ఏసు ప్రభువు దయ చూపాలని కోరుతున్నానని అన్నారు.
