అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్ర కులాల పేదలకు (ఈడబ్ల్యూఎస్ వర్గీయులు) కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని, వారి పేదరికాన్ని పారదోలేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తులు తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ యువతకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఒకే సముదాయంలో కమ్మ కార్పొరేషన్, పాలకమండలి సభ్యుల కార్యాలయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు స‌విత‌. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

గతంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. కొద్ది రోజుల కిందట ఎంఎస్ఎంఈ పార్కుల్లో వ్యాపార అవకాశాలపై మరో సదస్సు నిర్వహించామన్నారు. ఏయే రంగాల్లో ఆర్థిక వృద్ధి లభిస్తుందో వాటిపై ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సులు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు గౌరవప్రద జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు స‌విత‌. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగా కల్పించి తీరుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఘనత అంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!