అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు

28న తర్లువాడలో శంకుస్థాప‌న చేయ‌నున్న సీఎం

అమరావతి : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా డేటా సెంటర్ విశాఖ నగరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ నగరాల సరసన చేరనుంది. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా 1 గిగావాట్ సామర్ధ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది.

కూటమి ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండటంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్ సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ తో వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజితో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం తీర ప్రాంతం కావడంతో అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలం. తర్లువాడ, అడవి వరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో, 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో మల్టీ-గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.

Leave A Reply

Your Email Id will not be published!