క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్
హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
అమరావతి : రాష్ట్రంలో “క్రెడిట్ చోరీ” అనే కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ముందుగానే ఒక అంశంపై సందేహాలు సృష్టించి, తరువాత అదే విషయాన్ని తమ విజయంగా ప్రకటించడం ఆయనకు అలవాటైందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డికి, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి. ఎదుటివారి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి ‘క్రెడిట్ చోరీ’ చేయడంలో ఎవరూ సాటిరారని మండిపడ్డారు. ఏ పథకమైనా, ప్రాజెక్టైనా అది ఎందుకు అవుతుందో మొదట ప్రజలను తప్పుదోవ పట్టించి, తీరా అది పూర్తయ్యాక మాత్రం “నా వల్లనే అయింది” అని చెప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తుడనన్నారు.
ఈ ఐదేళ్ల విధ్వంసానికి పూర్తి బాధ్యత ఆయనదేని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాసం శెట్టి సుభాష్ మాట్లాడారు. ఐదేళ్ల పాటు ‘మూడు ముక్కలాట’ ఆడి, అమరావతిని భ్రష్టు పట్టించిన ఘనత జగన్ దేనని ఆరోపించారు. దేశ చరిత్రలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టిన క్రెడిట్ ఆయనది కాదా? అని ప్రశ్నించారు. ఈరోజు మళ్లీ అమరావతి పేరు వినపడటం ఇష్టం లేక కొత్త రాగాలు అందుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అమరావతిని గ్రాఫిక్స్ అని, భ్రమ అని అవహేళన చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అదే ప్రాంతాన్ని ‘మావిగన్’ (MAVIGAN) అని పిలుస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు వాసంశెట్టి సుభాష్. అమరావతి పేరు పలకడం ఇష్టం లేకనే ఇలా కొత్త పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
