విశాఖపట్నం : విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన తరలి వచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. ఆమెతో పాటు కేంద్ర మంత్రులు హెచ్ డి కుమార స్వామి, శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు , కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పరామర్శించారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.
ప్రమాద ఘటనపై కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి జీవితకాలం తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసు కోవడానికి మంత్రి లోకేష్ ఉద్యోగులతో మాట్లాడారని తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు.
