నంద్యాల జిల్లా : ఏపీలో కూటమి సర్కార్ జనరంజక పాలన సాగిస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బనగానపల్లెలో గురువారం జరిగిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు .గడచిన రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతోందని అన్నారు. గత పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని అన్నారు. లక్షల కుటుంబాలు వారి అరాచకానికి బలయ్యాయని ఆరోపించారు. నచ్చని వారిని భయపెట్టేందుకు వారి భూముల్ని గత పాలకులు 22ఏ కింద పెట్టేశారని పేర్కొన్నారు. వివాదాలు సృష్టించి భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు చేశారని ఫైర్ అయ్యారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఓ నల్లచట్టాన్ని తెచ్చారు. ప్రజల ఆస్తుల్ని కాజేసేలా భయాందోళనలు సృష్టించారని మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తేవటమే సమస్యను మరింత జఠిలం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నల్లచట్టాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేశాం అన్నారు సీఎం. భూ వివాదాల పరిష్కారానికి ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత పాలకులు మీ భూమి పత్రాలపైన ఫోటోలు వేసుకున్నారని, సర్వే రాళ్లపై కూడా చిత్రాలు ముద్రించుకున్న ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఆ ఫోటోల పిచ్చిని రద్దు చేసి రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నాం అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లను పెట్టి తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
