హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఎఫ్సిఐకి పూర్త మద్దతు ఉంటుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు.రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జరుగుతున్న వరి సేకరణకు అనుగుణంగా, కేంద్ర పూల్కు తన వాటాను బలోపేతం చేసేందుకు తెలంగాణలో ఆహార ధాన్యాల నిల్వ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ)కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలంగాణ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ అనుజ్ త్యాగి మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ మౌలిక సదుపాయాలు, రవాణాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న వరి సేకరణ కారణంగా తెలంగాణలో తమ ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచు కోవాల్సిన అవసరం ఉందని మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో ఆధునిక గిడ్డంగులను ఏర్పాటు చేయడం ద్వారా నిల్వ మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచే ప్రణాళికలను వివరించారు.
దీనికి సానుకూలంగా స్పందిస్తూ,నిల్వ విస్తరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధమైన అనుమతులు పొందడానికి, అదనపు నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయంతో సహా అవసరమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని ఆయన అన్నారు.సేకరణ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని, ఆహార ధాన్యాల సకాలంలో రవాణా జరిగేలా చూడాలని, తద్వారా సేకరణ సీజన్లలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి నొక్కి చెప్పారు.
