అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కీలక నివేదికను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58 శాతం ఏపీకి వచ్చినప్పటికీ వనరుల్లో వాటా మాత్రం 46 శాతమేనని పేర్కొన్నారు. రాజధాని కోల్పోవడంతో ఆదాయ సమీకరణపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. విభజన అనంతరం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా పెరిగిందని, ఇదే సమయంలో సేవల రంగం వాటా తగ్గిందన్నారు.2014–19 మధ్య ఏపీ సగటు GSDP వృద్ధిరేటు 13.5 శాతంగా ఉందన్నారు సీఎం. ఇదే సమయంలో తెలంగాణతో పోల్చుకుంటే రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గిందన్నారు. 2019–24 మధ్య రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగించిందని వెల్లడించారు. 2014–19లో ఉన్న వృద్ధిరేటును కొనసాగించక పోగా 10.30 శాతానికి పడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2014-19 వృద్ధి రేటు కొనసాగక పోవడం వల్ల రూ.6.94 లక్షల కోట్ల జీఎస్డీపీని నష్ట పోయాం అన్నారు. తెలంగాణతో తలసరి ఆదాయం 2018–19లో రూ.55,817 ఉండగా.. 2023–24 నాటికి రూ.1,06,854కు పెరిగిందని తెలిపారు సీఎం. 2025-26లో ఏపీ తలసరి ఆదాయం రూ.2,94,507గా ఉందన్నారు. 2014–19 సగటు వృద్ధిరేటు కొనసాగి ఉంటే 2025–26లో ఏపీ తలసరి ఆదాయం రూ.3,67,115 ఉండేదని, దీని వల్ల ఏపీ తలసరి ఆదాయం రూ.72,608 మేర తగ్గిపోయిందని వెల్లడించారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో గత ప్రభుత్వాలను సరిదిద్దుతూ.. వ్యవస్థలను గాడిలో పెడుతూ కరెక్టివ్ బడ్జెట్ ప్రవేశ పట్టడం జరిగిందన్నారు . 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మూడు రీజియన్లకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధి ప్రణాళికలతో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న రూ. 48616 కోట్ల పెండింగ్ బిల్లులకు గానూ రూ. 19,357 కోట్లు చెల్లింపులు జరిపామన్నారు. గ్రాట్యుటీ, సీపీఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీ-ఇంబర్సుమెంట్ కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్లో రూ.30,849 కోట్ల చెల్లించామని తెలిపారు సీఎం. 86 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్దరణ కోసం పెండింగులో ఉన్న రూ. 8,695 కోట్లు కేంద్రానికి జమ చేశారు.. యూసీలు సమర్పించారని వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిక పథకాల పునరుద్దరణతో రాష్ట్రంలో రూ. 45,138 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగితే.. ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 29,890 కోట్లు ఇచ్చింది.కేంద్ర ప్రాయోజిత పథకాల పునరద్దురణ వల్లే జల్ జీవన్ మిషన్, సమగ్ర శిక్ష, నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్, నరేగా వంటి పథకాలకు ఎక్కువ నిధులు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు చెల్లింపులు జరగకుండా పెండింగ్ పెట్టిందన్నారు. వీటిల్లో రూ.3142 కోట్ల పెండింగ్ బిల్లులతో సహా మొత్తంగా రూ.7404 కోట్లను స్థానిక సంస్థలకు, వైద్యారోగ్య రంగానికి బదలాయించడం జరిగిందన్నారు.
