పోటీతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం
31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో భట్టి విక్రమార్క
మహాబలిపురం : తమిళనాడులోని మహాబలిపురంలో సీఎం జోసెఫ్ విజయ్ సారథ్యంలో 31వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం తరపున ఇంఛార్జ్ సిఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పలు అంశాలను లేవనెత్తారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర ఆసక్తి గల సమస్యలపై చర్చించి, సామరస్యంగా పరిష్కరించడానికి, నిర్ణయాల అమలును వేగవంతం చేయడానికి దక్షిణ మండల మండలి ఒక ముఖ్యమైన వేదికగా ఉంటోందన్నారు. ఒక బలమైన వ్యవస్థకు దానిలోని ప్రతి భాగం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని; ప్రతి భాగం తన వంతు భారాన్ని మోయడం అవసరమని వ్యాఖ్యానించారు. భారతదేశ సమాఖ్య వ్యవస్థను కూడా ఇదే స్ఫూర్తితో చూడాలని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ ఏకీభవించినప్పుడు సమాఖ్యకు నిజమైన పరీక్ష ఉండదని; చట్టబద్ధమైన ప్రయోజనాలు ఘర్షణ పడినప్పుడు, అయినప్పటికీ ఒక న్యాయమైన మార్గాన్ని కనుగొన్నప్పుడే దానికి నిజమైన పరీక్ష ఉంటుందని భట్టి నొక్కి చెప్పారు. అందువల్ల, రాష్ట్రాల మధ్య సమస్యలకు న్యాయమైన, కాలపరిమితితో కూడిన , చట్టబద్ధంగా నిలబడగల పరిష్కారాన్ని కోరడమే తెలంగాణ విధానం అని స్పష్టం చేశారు.పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు , ప్రతిభ కోసం రాష్ట్రాలు సహజంగానే పోటీ పడతాయని, ఇది సహజమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఫైళ్ల కంటే సమస్యలే వేగంగా సరిహద్దులు దాటుతాయి అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఇటువంటి పరస్పర ఆధార పడటం వలనే దక్షిణ జోనల్ కౌన్సిల్ వంటి సంస్థలు అవసరమయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణకు, సహకార సమాఖ్యవాదం చాలా ఆచరణాత్మకమైన అర్థాన్ని కలిగి ఉందన్నారు. వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సంస్థలను గౌరవించాలి; అవే నియమాలు అందరికీ వర్తించాలన్నారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఎలాంటి ప్రత్యేక ఆధిక్యతను కోరడం లేదన్నారు .ఇప్పటికే అమలులో ఉన్న చట్టపరమైన యంత్రాంగాల ద్వారా తన న్యాయమైన హక్కును కోరుతోందని చెప్పారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఏకపక్ష చర్యల నుండి రక్షణ కల్పించాలని మాత్రమే కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 వచ్చి పన్నెండేళ్లు గడిచినా రెండు వారసత్వ రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలి పోయాయని వాపోయారు. .
