రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆరోగ్య ప‌థ‌కం ప్రారంభం

కార్పొరేట్ ఆసుపత్రుల ఏకాభిప్రాయంతో అమ‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు వారి ఆధారితుల ఆరోగ్య భద్రతకు ఒక చారిత్రాత్మక ముందడుడు ప‌డింది. కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేసే ముఖ్యమైన ముందడుగు ఇది. తెలంగాణ సచివాలయంలో ట్రస్ట్ బోర్డు కన్వీనర్ , ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్సీ సీఈఓ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీజీ-జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తో సహా ఉద్యోగుల ఆరోగ్య పథకం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అలాగే అపోలో హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చర్చల అనంతరం టీఎస్ హెచ్ ఏ పాల్గొన్న ఆసుపత్రుల బృందాలు ఏకగ్రీవంగా న్యూ ఈహెచ్ ఎస్ పథకాన్ని నేటి నుండే తక్షణమే అమలు చేయాలని అంగీకరించాయి. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స సదుపాయాలు నేటి నుండి అందుబాటులోకి వచ్చాయి. సమావేశంలో న్యూ ఈ హెచ్ ఎస్ మార్గ దర్శకాలను కూడా విడుదల చేశారు, ఇవి ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్, చికిత్స ప్రోటోకాల్స్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానాలకు సంబంధించిన సవరించిన విధి విధానాలను నిర్దేశిస్తాయి.

ఈ కొత్త పథకానికి ఆసుపత్రుల వర్గం సహకరించిన తీరుపై ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఇది ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించారు.
లబ్ధిదారులకు సకాలంలో, ఇబ్బంది లేకుండా చికిత్స లభించేలా న్యూ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేయడంలో పూర్తి సహకారం అందించాలని ఎంపానెల్డ్ ఆసుపత్రులందరికీ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!